
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్ – జూన్) సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అంటే గతంలో ఉన్న వడ్డీ రేట్లే ఈ మూడు నెలలు కూడా కొనసాగుతాయి.
వడ్డీ రేట్లు ఎందుకు మారలేదు..?
సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అయితే.. వరుసగా ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచారు. చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ రేట్లలో మార్పులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కేంద్రం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం వివిధ పథకాల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా.. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకానికి అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో భాగంగా.. దీర్ఘకాలిక పొదుపు కోసం ఎంతో మంది ఎంచుకునే ఈ పథకానికి 7.1 శాతం వడ్డీ కొనసాగుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకంలో.. వృద్ధులకు భరోసా ఇచ్చే ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకంపై 7.7 శాతం వడ్డీ రానుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంపై 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) పథకం విషయానికి వస్తే.. ప్రతినెలా ఆదాయం కోరుకునే వారికి 7.4 శాతం వడ్డీ అందుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ పథకంలో సాధారణ పొదుపు ఖాతాలపై 4 శాతం వడ్డీ లభిస్తుంది.
పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనం..
మార్కెట్లో బ్యాంక్ వడ్డీ రేట్లు మారుతున్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వల్ల సామాన్యులకు, రిటైర్డ్ ఉద్యోగులకు తమ రాబడిపై ఒక స్పష్టమైన భరోసా ఉంటుంది. సురక్షితమైన పెట్టుబడితో పాటు పన్ను మినహాయింపులు కూడా లభించడం వల్ల చాలా మంది ఇప్పటికీ పోస్టాఫీసు, ప్రభుత్వ పొదుపు పథకాలనే నమ్ముకుంటున్నారు.