
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా ఉద్యమకారుల కోసం ప్రత్యేక వాగ్దానాలను మేనిఫెస్టోలో పొందుపరచాలని సూచించారని, ఆ నమ్మకంతోనే ఉద్యమకారులు కాంగ్రెస్ వైపు నిలిచారని ఆమె గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ ఆ ఒక్క హామీ కూడా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
Ground War On: ఇరాన్తో యుద్ధం.. 57,000 మంది అమెరికా సైనికుల మొహరింపు..
ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన 250 గజాల ఇళ్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, నెలకు 4000 రూపాయల పెన్షన్ వంటి కీలక హామీలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటితో పాటు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ , అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టినా, రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ప్రభుత్వ గౌరవం మరింత పెరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆన్ టైమ్లో ఈ వాగ్దానాలను నెరవేర్చి ఉద్యమకారులను గౌరవించాలని విజయశాంతి కోరారు.
HYDRA : ఇందిరా పార్క్లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!