
తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకుగానూ బిజెపి ఎంపిలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్లకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వేరువేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కెటిఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ, చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్లకు కెటిఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. బండి సంజయ్కు పంపిన లీగల్ నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కెటిఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు.
కెటిఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. అదేవిధంగా ఎంపి ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు. కెటిఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటి రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో వివరించారు. ఈ ఇద్దరు ఎంపిలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కెటిఆర్కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశా రు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షం లో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కెటిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.