Reading Time: < 1 minute

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం, అందులో సిఎం బావమరిది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పం దించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారని విమర్శించారు.

ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం.. అందులో రేవంత్‌రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్‌గా పాత్ర పోషించింది నిజం అని పేర్కొన్నారు. శుక్రవారం తాను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్‌లో మాట్లాడలేదు? అని నిలదీశారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆర్‌ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు… జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు అని విమర్శించారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు..? అని అడిగారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా..? అని నిలదీశారు.