Reading Time: < 1 minute

హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. అబిడ్స్‌, నాంపల్లి, ఎంజె మార్కెట్‌, ఏక్‌మినార్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను ఇతర మార్గాలకు మళ్లీస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దని పోలీసులు సూచించారు. ఎగ్జిబిషన్‌ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.

కాగా, నాంపల్లిలో ఓ ఫర్నీచర్‌ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. ఫర్నీచర్‌ షోరూమ్‌ గోదాం భవనంలో వాచ్‌మెన్‌ కుటుంబంలో ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు పెద్దవారితో సహా ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించారు. దాదాపు 4 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.