Reading Time: < 1 minute

దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో అరోన్ జార్జి 85 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే 38, కనిష్క్ చౌహాన్ 46 పరుగులతో రాణించారు. అనంతరం 241 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ లక్ష్య చేధనలో తడబడింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుప్పకూలిపోయింది. దీంతో పాక్ 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బ్యాటింగ్‌లో హుజైఫా అసన్ 70 పరుగులు చేయగా.. కెప్టెన్ ఫర్హాన్ యూఫఫ్ 23, ఉస్మాన్ ఖాన్ 16 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరి మూడు, కిషన్ కుమార్ సింగ్ 2, ఖలన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో ఇటు బౌలింగ్‌లో రాణించిన కనిష్క్ చౌహాన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.