
హైదరాబాద్: అసెంబ్లీ పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ప్రజల విశ్వాసం కోల్పోతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ముక్కలు కాబోయే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు. మొన్న కమ్యూనిస్టు కంచుకోట కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేశామని, నిన్న మహారాష్ట్ర రాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున తెలంగాణలోని మున్సిపాలిటీలను సాధిస్తామని రాంచందర్ స్పష్టం చేశారు. అనేక వాగ్దానాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కమీషన్లకు కోసం పాకులాడడం తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. 40% కమీషన్ల కోసం రాష్ట్ర మంత్రులే కొట్లాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల ద్వారా భారీగా వచ్చిన నిధులు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఢిల్లీకి వెళ్లడం రావడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్రం నిధులు వాటంతట అవే వస్తాయని తెలియజేశారు. కేంద్ర నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
పిఎం మోడీని ప్రతి మూడు నెలలు ఒకసారి కలవడంపై సిఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ అభివృద్ధి కోసమే మోడీని కలుస్తానని చెప్పారు. మోడీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయన కలుస్తున్నానని వివరణ ఇచ్చిన విషయం విధితమే. తెలంగాణ ప్రయోజనాల కోసమే కలుస్తానని, వ్యక్తిగత పైరవీలు, స్వార్థ ప్రయోజనాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.