Reading Time: < 1 minute

సికింద్రాబాద్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో ఏర్పాటైన విజయ్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ జంట నగరాల్లో సికింద్రాబాద్ ఎన్నో సంవత్సరాలుగా అన్నింటికీ కేంద్రంగా ఉందని తెలిపారు. అటువంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో బిజెపి అధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలు సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

రెహమాన్ వ్యాఖ్యలు బాధాకరం

ఇదిలాఉండగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను ముస్లిం కావడం వల్లే అవకాశాలు రావడం లేదని తప్పుడు కామెంట్స్ చేశారని ఆయన అన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రెహమాన్‌ను అభిమానులెవరూ ముస్లిమా? హిందువా? అని చూడలేదని ఆయన తెలిపారు.