
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్… ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి గొప్ప చిత్రాలను ప్రేక్షకులను అందించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి రాబోయే ప్రాజెక్టులపై చర్చించారు. పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ భేటీ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ స్పందిస్తూ.. “భోగి శుభ సందర్భంగా కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ… పవన్ కళ్యాణ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ని కలిసి మరింత విస్తృతంగా చర్చించారు’‘ అని తెలిపింది. ఈ ట్వీట్ కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బదులిస్తూ.. “ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన, ప్రభావవంతమైన కంటెంట్ను అందించేందుకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాము. ఈ అద్భుత ప్రయా ణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము” అని తమ సంతోషాన్ని పంచుకున్నారు.