Reading Time: 2 minutes
Virat Kohli: హరివంశీలుగా మారిన విరుష్క జంట.. ఇకపై వీరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే..

భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక పట్టణం బృందావనంలో సందడి చేశారు. వరాహ ఘాట్‌లోని శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఏడాదిలో బృందావనానికి వారు వెళ్లడం ఇది మూడవసారి. అయితే, ఈ పర్యటన అనంతరం “విరాట్ మరియు అనుష్క ఇప్పుడు హరివంశీలుగా మారారు” అనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఆధ్యాత్మికంగా ‘హరివంశీ’ అంటే అర్థం ఏంటి?

‘హరివంశీ’ అనేది కేవలం ఒక పేరు మార్పు కాదు, అదొక నిబద్ధత. వైష్ణవ సంప్రదాయం ప్రకారం, శ్రీకృష్ణుడిని (హరి) తన ఇష్టదైవంగా భావించి, రాధాకృష్ణుల భక్తి మార్గంలో నడిచేవారిని ‘హరివంశీ’లు అని పిలుస్తారు. అంటే వీరు ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడి వంశానికి చెందిన వారుగా భావిస్తారు. ముఖ్యంగా ప్రేమానంద్ జీ మహారాజ్ బోధనలను అనుసరిస్తూ, వినయం, భక్తి, మరియు ‘నామ జపం’ చేసేవారిని ఇలా సంబోధిస్తారు. సోషల్ మీడియాలో విరుష్క జంటను ‘హరివంశీ’లు అనడం వెనుక ఉద్దేశ్యం.. వారు ఆ ఆధ్యాత్మిక మార్గానికి పూర్తిగా అంకితమయ్యారని చెప్పడమే.

తులసి మాలల ప్రాముఖ్యత
ఆశ్రమ సందర్శనలో విరాట్, అనుష్క ఇద్దరూ మెడలో పవిత్రమైన తులసి మాలలు ధరించి కనిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేవారు, నిరంతరం ప్రార్థనలు చేసేవారు మాత్రమే ఈ మాలలను ధరిస్తారు. వీరి భక్తి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ప్రేమానంద్ జీ మహారాజ్ హితబోధ
ఈ పర్యటనలో కోహ్లీ దంపతులు గురువుగారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఒక విలువైన సలహా ఇచ్చారు. “మీ వృత్తిని దైవసేవగా భావించండి. ఎల్లప్పుడూ వినయంగా ఉండండి మరియు నిరంతరం భగవంతుని నామస్మరణ చేయండి” అని సూచించారు.

లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే విరాట్ జంట బృందావనానికి వెళ్లడం, భగవంతుడిపై వారికున్న అచంచలమైన నమ్మకాన్ని చాటిచెబుతోంది.