
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తనయగా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆదిపర్వం’, ‘దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ’ చిత్రాల్లో నటించిన ఆమె, మార్చి చివరి వారంలో ‘లేచింది మహిళా లోకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తూ తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై నిప్పులు చెరిగారు.
Also Read : Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, మన సమాజం మహిళలను ఎలా జడ్జ్ చేస్తుందో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘మగవాళ్లు ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే ప్రశంసలు కురుస్తాయి.. అదే ఆడవాళ్లు చేస్తే మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటారు. మేము చేస్తే సంసారం.. మీరు చేస్తే ఆ వ్యవహారం అనే విధంగా ఉంటుంది. ఆ సామెతను నా నోటితో పూర్తిగా చెప్పను కానీ, మీకు అర్థమైందని అనుకుంటున్నాను’ అని మంచు లక్ష్మి అన్నారు. ఆడవాళ్లు ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి అని ఎవరు రాశారని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.. ‘నా పెళ్లి సమయంలోనే నా భర్తకు ఒక మాట చెప్పాను. నువ్వు ఏ పని చేస్తావో.. అదే పని నేను కూడా చేయగలను అని గుర్తుంచుకోమన్నాను. దాంతో ఆయన ఏదైనా చేయడానికి జంకుతాడు. నేను చేస్తే తను కూడా చేస్తుందనే భయం ఆయన మనసులో ఉంటుంది’ అని లక్ష్మి పేర్కొన్నారు. అలా మహిళలు కూడా తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.