Reading Time: < 1 minute
బొగ్గు స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం… ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు!

పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (IPAC) కార్యాలయాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్‌ వ్యవస్థాపకులు రిషిరాజ్‌ సింగ్‌, ప్రతీక్‌ శర్మ, వినీష్‌ చందాకు చెందిన కార్యాలయాలు,
నివాసాల్లో ED అధికారులు సోదాలు చేస్తున్నారు.

దర్యాప్తు సంస్థ ఈడీ ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై దాడి చేసింది. ఈ దాడిపై ఆ సంస్థ ఒక ప్రకటనలో, “ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఐప్యాక్ వంటి వృత్తిపరమైన సంస్థకు ఇది ఒక కష్టమైన, దురదృష్టకరమైన రోజు” అని పేర్కొంది.

ఇదిలావుంటే, ఐపాక్ (IPAC) సంస్థ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్), జనతా దళ్ (యునైటెడ్), శివసేన వంటి అనేక రాజకీయ పార్టీలకు వృత్తిపరమైన, సిద్ధాంతపరమైన సలహాదారుగా పనిచేసింది.

ఐప్యాక్‌పై ఈడీ దాడులు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడులలో జోక్యం చేసుకున్నారని, పోలీసుల సహాయంతో డిజిటల్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలను తొలగించి, ఏమీ స్వాధీనం చేసుకోకుండానే సోదాలను నిలిపివేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది.

తాజాగా బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సుమారు రూ. 20 కోట్ల హవాలా నిధులను ఐప్యాక్‌కు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డేటాను తారుమారు చేయకుండా రక్షణ కల్పించడం, తమ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ నుండి ఉపశమనం కల్పించడంతో సహా పలు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..