Reading Time: < 1 minute
The Telugu Film Chamber Has Lodged A Formal Complaint With The Cyber Crime Police Against Popular Piracy Websites

తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి పట్టిపీడిస్తోంది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమాలను కొన్ని వెబ్‌సైట్లు అక్రమంగా లీక్ చేయడాన్ని టాలీవుడ్ పెద్దలు తీవ్రంగా పరిగణించారు. తాజాగా ఐదు ప్రధాన చిత్రాలను పైరసీ చేసిన వెబ్‌సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read : Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీనారీ నడుమ మురారి సినిమాలతో పాటు ఇటీవల రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను కూడా పైరసీ చేసారు. రిలీజ్ రోజు సాయంత్రానికే పైరసీ సెట్స్ ఈ సినిమాలను హై క్వాలిటీతో సైట్స్ లో అప్ లోడ్ చేసాయి. ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కీలకమైన 7 వెబ్‌సైట్లను నిందితులుగా చేర్చారు. ఇందులో 5 మూవీరుల్జ్ కు చెందిన డొమైన్లు, 1 సినీవుడ్ మరియు 1 తమిళ్ ఎంవీ వెబ్‌సైట్లు ఉన్నాయి. ఈ సైట్లు సినిమాలను హై క్వాలిటీలో అప్‌లోడ్ చేస్తూ నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. పైరసీని ప్రోత్సహించే వెబ్‌సైట్లను పోలీసులు బ్లాక్ చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. పైరసీ సైట్లను సందర్శించడం లేదా ఆ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడాలని ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది.