Reading Time: < 1 minute

భూమి పట్టా కోసం రూ.50 వేల డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన రెవెన్యూ ఉద్యోగి

Caption of Image.

జగిత్యాల జిల్లాలో అవినీతి అధికారుల బాగోతం మరోసారి బయటపడింది. ప్రజలకు సేవ చేయాల్సిన రెవెన్యూ కార్యాలయంలోనే అందినకాడికి దండుకుంటున్న అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఒక రెవెన్యూ ఉద్యోగి.

బీర్పూర్ మండలానికి చెందిన ఒక మహిళ తన భూమికి పట్టా కోసం ‘భూభారతి’ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ భూమికి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చేందుకు అక్కడి రెవెన్యూ ఉద్యోగి గిరిధావర్ రాహుల్ ఏకంగా 50 వేల రూపాయల లంచాన్ని డిమాండ్ చేశాడు.  మహిళా బాధితురాలు ఎంత బతిమిలాడినా వినకుండా చివరకు 40 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. అడిగిన దానిలో భాగంగా ముందుగా 30 వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా, రంగంలోకి దిగిన అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు.

తహసీల్దార్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధితురాలి నుండి 30 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రాహుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అవినీతి అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఏసీబీ దాడులతో కార్యాలయంలోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.