
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రాబోయే మూడు గంటల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుందని అధికారులు వెల్లడించారు.
ఈ వర్షాల దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేసింది. వర్షంతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు.
విజయనగరం, మన్యం జిల్లాలతో పాటు పాత శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా స్థానిక జిల్లా యంత్రాంగాలు, సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కలెక్టరేట్లలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్లను సైతం ఏర్పాటు చేశారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే గమనిస్తూ, ప్రమాదకరమైన వర్షపు నీటిలో రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని యంత్రాంగం గట్టిగా ఆదేశించింది.