
KBR Park : హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వాహనదారులకు ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్ట్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాల కారణంగా రహదారి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం, పరిమిత స్థలంలోనే ఇరువైపులా వాహనాలు వెళ్లడం వల్ల నిత్యం రాకపోకలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ పూర్తిగా వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
రెండు దశల్లో ట్రయల్స్.. 24 గంటల పర్యవేక్షణ
ఈ వన్వే విధానాన్ని ఆకస్మికంగా కాకుండా పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 5 , జూన్ 21 తేదీలలో రెండు దశల్లో ప్రయోగాత్మకంగా ట్రయల్స్ నిర్వహించి, జంక్షన్ల వద్ద లేన్ క్రమశిక్షణ, రద్దీ ప్రాంతాల తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ అనుభవాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి ఇప్పుడు అధికారికంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నూతన విధానం సజావుగా సాగేందుకు 24 గంటలూ పట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీలు, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం దిశా సూచిక బోర్డులు, లేన్ మార్కింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ యాప్లలో కూడా ఈ మార్పులను అప్డేట్ చేస్తున్నారు.
రాంగ్సైడ్ డ్రైవింగ్పై హెచ్చరిక.. వాహనదారులకు సూచనలు
కొత్త ట్రాఫిక్ నిబంధనల దృష్ట్యా వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారులు ఖాళీగా ఉన్నాయనే ఉద్దేశంతో రాంగ్సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అత్యవసర వాహనాలైన అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్ల కోసం ప్రత్యేకంగా లేన్-2ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేబీఆర్ పార్క్కు వచ్చే సందర్శకులు, వాకర్లు తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ మార్పులపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏడాదిన్నర వరకు వన్ వే అమల్లో ఉంటుంది అనుకుంటున్నాం : సజ్జనార్
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపడుతున్న హెచ్-సిటీ ప్రాజెక్ట్ నిర్మాణాలు, ట్రాఫిక్ నిబంధనలు , డైవర్షన్లపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిపిటి (PPT) ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడిస్తూ, పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్ల వద్ద ఆగస్టు 18న ఉదయం 6 గంటల నుంచి సుమారు ఏడాదిన్నర పాటు వన్వే విధానం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 110 పిల్లర్లు రానున్నాయని, తాత్కాలికంగా కొన్ని నెలల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ భవిష్యత్తులో సురక్షితమైన ప్రయాణం, కాలుష్యం తగ్గడం , ప్రయాణ సమయం ఆదా కావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్స్ నిర్వహించి సాంకేతిక సమస్యలను సరిదిద్దామని చెప్పిన సిపి, 4 షిఫ్టుల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని , ఐసిసిసి (ICCC) కంట్రోల్ రూమ్తో పాటు నిరంతరం రెండు డ్రోన్ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను మానిటర్ చేస్తామని చెప్పారు. కేబీఆర్ పరిసరాల్లో 10 ప్రధాన ఆసుపత్రులు ఉన్నందున అంబులెన్స్లకు ఆటంకం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇస్తూ, వాహనదారులు కూడా అంబులెన్స్లకు దారి ఇవ్వాలని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుంటూ అధికారిక ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.