Reading Time: 2 minutes
Off The Record Over Tdp 30

కాణిపాకం వినాయకుడి సాక్షిగా…. టీడీపీ నేతలు కంగారు పడుతున్నారా? ఎందుకొచ్చిన గొడవ…. కాస్త ఆచితూచి మాట్లాడదామని అనుకుంటున్నారా? ప్రమాణ పూర్తిగా చెబుతున్నామంటూ వైసీపీ నేతలు వెలిగిస్తున్న కర్పూరపు సెగలు తమ్ముళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? ఏంటా ప్రమాణాల పర్వం? అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం నేతలు ఒకడుగు వెనక్కి వేయడానికి కారణాలేంటి? కాణిపాకం వినాయక స్వామికి, ఏపీ పాలిటిక్స్‌కు ఇంటర్‌లింక్‌ ఎప్పుడూ ఉంటుంది. సత్యప్రమాణాల దేవుడు కాబట్టి ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలనుకునే ప్రతినేత సంబంధం లేకున్నా…. ఆ స్వామిని సీన్‌లోకి తీసుకువస్తాడు. రా… కాణిపాకంలో ప్రమాణం చేద్దామని ఛాలెంజ్‌ విసురుతాడు. ఈ ఆలయం ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే… ఈ ట్రెండ్‌ మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే అధికార టీడీపీని ఇరకాటంలో పెడుతోందట. విపక్షం వైసీపీ వాడుతున్న ప్రమాణాస్త్రం దెబ్బకు ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం నేతలు విలవిల్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో అలా చేశారు… అంటూ తమను ఉద్దేశించి టీడీపీ వాళ్ళు అనడం ఆలస్యం…”పద… కాణిపాకంలో ప్రమాణం చేద్దాం” అంటూ వైసీపీ నేతలు విసురుతున్న సవాళ్లు కూటమికి తలనొప్పిగా మారాయని అంటున్నారు.

సాధారణంగా పోలీసు స్టేషన్లు, కోర్టులకు వెళ్ళాల్సిన వివాదాలను నేరుగా దేవుడి ముందర పెట్టేసి పొలిటికల్ మైలేజ్ కొట్టేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్న అధికార పార్టీ నేతలకు చెక్ పెట్టడానికే వైసీపీ ఈ అస్త్రాన్ని గట్టిగా వాడుతోందన్నది జిల్లాలో గట్టిగా వినిపిస్తున్న మాట.ఈ దెబ్బతో ఎదురుదాడి చేయాల్సింది పోయి, తామే దొరికిపోయామనే ఆందోళన తమ్ముళ్లలో కనిపిస్తోందని అంటున్నారు. ఈ వివాదానికి అసలు బీజం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ చేసిన వ్యాఖ్యలతో పడింది. “చిత్తూరోళ్ళు బెంగళూరు నగరాన్ని ఏలుతున్నారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ పొరుగు రాష్ట్రంలో ఆగ్రహానికి కారణం అయ్యాయి. కన్నడ సంఘాల నిరసనలు, ఎఫ్‌ఐఆర్‌ల దాకా వెళ్లడంతో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పక తప్పలేదు. అయితే… దీని వెనక వైసీపీ ఉందంటూ అటువైపు నెట్టేసేశారు ఎమ్మెల్యే. కానీ స్థానిక వైసీపీ ఇన్చార్జ్‌ విజయానంద రెడ్డి అందుకు షార్ప్‌గా రియాక్ట్‌ అయ్యారు. మేం చెబితే కన్నడిగులు ఆందోళలు చేస్తారా అంటూ…. ఏమాత్రం తగ్గకుండా ధైర్యం ఉంటే కాణిపాకం కోనేట్లో మునిగి ప్రమాణం చేయండి అంటూ సవాల్ విసిరారు.

అంతటితో ఊరుకోకుండా… తన అనుచరులతో వెళ్లి కోనేట్లో మునిగి ప్రమాణం చేసి చూపించారాయన. దీంతో… అప్పటిదాకా సై అంటూ కాణిపాకం వచ్చిన తమ్ముళ్లు అసలు విషయం వదిలేసి ఏం చేయాలో పాలుపోక సైలెంట్ అయిపోయారట. అనవసరంగా ఈ విషయాన్ని కదిపి వైసీపీకి హీరో ఇమేజ్ ఇచ్చామనే చర్చ ఇప్పుడు చిత్తూరు టీడీపీలో నడుస్తోందట. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు కన్నడిగులు సీరియస్ అయితే…. దానికి ఇక్కడ లొల్లి లేపి బోల్తా పడ్డామనే ఫీలింగ్ తమ్ముళ్లలో వ్యక్తమవుతోందంటున్నారు. ఇక తిరుపతిలోనూ ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. 2019 నాటి పసుపులేటి మురళి అలియాస్ బెల్ట్ మురళి హత్య కేసు ఇప్పుడు తిరుపతి రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. కోర్ట్‌లో ఈ కేసు ఫైనల్‌ హియరింగ్‌కు వచ్చిన దశలో మళ్ళీ వివాదం రేగింది. టీడీపీ లీడర్‌ జేబీ శ్రీనివాస్ నివాసంపై వైసీపీ వాళ్ళు ఆయుధాలతో దాడి చేశారన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు.

ఆ సందర్భంగా.. వైసీపీ రౌడీలతో దాడులు చేయిస్తోందని, తిరుపతిలో లేని సంస్కృతిని మాజీ ఎమ్మెల్యే భూమన తీసుకొచ్చారంటూ ఫైరయ్యారు జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఈ గొడవ, దాడి ఆరోపణల క్రమంలో…. వైసీపీ నేత వాసు యాదవ్ తన అరెస్టుకు ముందే కాణిపాకంలో వినాయకుడి ముందర కర్పూరం వెలిగించారు. నేను దాడి చేయలేదు, తప్పు చేయలేదు కాబట్టే దేవుడి ముందు ప్రమాణం చేస్తున్నారనని అన్నారాయన. నీకు కూడా ధైర్యముంటే వచ్చి ప్రమాణం చేయి అంటూ జేబీ శ్రీనివాస్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అందుకు టీడీపీ నుంచి సమాధానం అయితే రాలేదు గాని సోషల్‌ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తోందట. ఇలా… రెండు కీలక వివాదాల్లోనూ కాణిపాకం స్వామివారి సాక్షిగా ప్రమాణాలకు సిద్ధమని వైసీపీ తేల్చిచెబుతుంటే, టీడీపీ నేతలు మాత్రం సరైన రిప్లయ్‌ ఇవ్వలేక విమర్శలకే పరిమితమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తప్పు లేకపోయినా తమను ఇరికించాలని చూస్తే ఊరుకోమని, వినాయకుడి సాక్షిగానే తేల్చుకుందామని వైసీపీ అంటున్న మాటలు జనంలోకి కూడా బాగానే వెళ్తున్నాయంటున్నారు. మేం నిజాయితీపరులం… దేవుడి సాక్షిగా ఆ విషయం తేలుతోందని ప్రజలకు చెప్పడంలో వైసీపీ సక్సెస్ అయిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఈ రెండు ఘటనలతో అలర్ట్‌ అయిన జిల్లా తమ్ముళ్లు.. ఇకపై తొందరపడి ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వకూడదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.