
Hyderabad: హైదరాబాద్లోని అబిడ్స్ పరిధిలో ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై కారు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు నాంపల్లి ఆండాళమ్మ బస్తీకి చెందిన సునీతగా అధికారులు గుర్తించారు. ఆమె గన్ఫౌండ్రీలోని ఎస్బీఐ బ్యాంకులో హౌస్కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని నిన్న సాయంత్రం(ఆగస్టు 12) చాపెల్ రోడ్డు గుండా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న మహానంద కారును వేగంగా తీసుకొచ్చి సునీతపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలని కారు యజమాని, సినీ నిర్మాత బొమ్మకు మురళికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన తీవ్ర నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానమిస్తూ “కారు నాదే, కానీ నేను పైసా కూడా ఇవ్వను.. కావాలంటే ప్రమాదం చేసిన డ్రైవర్నే చంపుకోండి” అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్కు చెందిన బొమ్మకు మురళి, ఒక టెక్నోక్రాట్, సామాజిక, రాజకీయ కార్యకర్త నుంచి ఆ తర్వాత సినిమా నిర్మాతగా మారారు. “శరణం గచ్ఛామి” ఆయన మొదటి సినిమా. తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం భారత రాజ్యాంగం, రిజర్వేషన్ల వ్యవస్థ అనే అంశాన్ని చర్చిస్తుంది.