
Jharkhand Student Protest: జార్ఖండ్ లోక్సేవా ఆయోగ్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర యువత సమరభేరి మోగించింది. పరీక్షల రద్దు, సీబీఐ (CBI) విచారణే ధ్యేయంగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఐదో విడతకు చేరి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు జేఎల్కేఎం (JLKM) నేత దేవేంద్ర నాథ్ మహతో 11 రోజులుగా, మరోవైపు విద్యార్థి నాయకుడు ప్రేమ్ నాయక్ 9 రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలతో ఈ ఉద్యమం కాకరేపుతోంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆసుపత్రిలో చేరినప్పటికీ, విద్యార్థులు తమ పోరాటాన్ని వీడకుండా ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తుండడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, రాత్రి వేళల్లో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా వస్తున్న వార్తలపై రాంచీ ఎస్పీ పార్స్ రాణా తీవ్రంగా స్పందించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నామన్నది పచ్చి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రాళ్లదాడి సంఘటన తర్వాత, ఉద్యమంలోకి అసమాజిక శక్తులు జొరబడకుండా చూడాలని కోర్ కమిటీ సభ్యులే కోరారని.. ఆ క్రమంలోనే అనుమానితుల గుర్తింపు, ఐడీ కార్డుల తనిఖీ కోసం మాత్రమే పోలీసులు స్టేడియానికి వచ్చారని వివరించారు. మరోవైపు, డీఎస్పీ, ఎస్ఎస్పీ, డీఎం వంటి ఉన్నతాధికారులు నిరసన స్థలానికి వచ్చి, ఆందోళన విరమించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ ఆరోపించారు. స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారిక ఉత్తర్వులు ఇవ్వనప్పటికీ, రాత్రివేళల్లో ఐడీ కార్డుల పేరుతో వచ్చి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఒకవేళ జైలుకు పంపినా తమ దీక్ష ఆగదని ప్రేమ్ నాయక్ తేల్చి చెప్పారు.
ఈ పరిస్థితులపై రాంచీ జిల్లా కలెక్టర్ (DC) మంజునాథ్ భజంత్రి స్పందిస్తూ, నిరసన తెలుపుతున్న ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం క్షీణించకుండా చూడడమే తమ ప్రాధాన్యమని, విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా వేరే మార్గాల్లో పోరాడాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాటి అసెంబ్లీ ముట్టడిలో 14 మందికి పైగా పోలీసులు గాయపడడం వల్లే బలాన్ని ప్రయోగించాల్సి వచ్చిందని ఆయన సమర్థించుకున్నారు. ఇక ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రతాప్ షాహి స్టేడియానికి చేరుకుని విద్యార్థులకు మద్దతు తెలిపారు. చీకటిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం విద్యార్థులను భయపెట్టాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం జార్ఖండ్ సమస్య కాదని, దేశవ్యాప్త యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొంటూ.. ఎన్డీయే ఎంపీలు ఈ అంశాన్ని ఇప్పటికే పార్లమెంట్లో లేవనెత్తారని, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ మొత్తం విద్యార్థుల వెంటే ఉందంటూ భరోసా ఇచ్చారు. JSSC-CGL పరీక్షను తక్షణమే రద్దు చేసి, సమగ్ర సీబీఐ విచారణ జరిపించే వరకు వెనక్కి తగ్గేదే లేదని విద్యార్థులు భీష్మించుకోవడంతో రాంచీలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.