
భారతదేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం పంపిన ఈ ప్రతిపాదన ఆధారంగా.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధృవీకరించారు. కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ పాలిమర్ నోట్లు చలామణిలో ఉంటాయని ఆమె వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నందున, అధికారిక విడుదల తేదీ లేదా ఖర్చు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి వీటిని చలామణిలోకి తెచ్చేలా ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గత 30 ఏళ్లుగా పాలిమర్ నోట్లు విజయవంతంగా వాడుకలో ఉన్నాయి. కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి 2 నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, తక్కువ విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోకుండా అరికడతాయి.
ఇదే సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన ఆర్థిక మంత్రి, దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా 2026-27 మొదటి త్రైమాసికంలో 3.9 శాతానికి చేరినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితి లోపే ఉందని స్పష్టం చేశారు. అలాగే.. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ద్వారా పన్ను భారాన్ని తగ్గించామని, వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రజల వ్యయ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేట్ వినియోగ వ్యయం పుంజుకోవడంతో పాటు, తక్కువ మరియు మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తికి రక్షణ లభిస్తోందని మంత్రి వెల్లడించారు.