Reading Time: 2 minutes
Scam 2010 Subrata Roys 24000 Crore Sahara Scam Comes To Ott

Scam 2010: భారతదేశంలో సంచలనం సృష్టించిన భారీ ఆర్థిక కుంభకోణాల కథలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను వరుసగా ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ నుంచి నకిలీ స్టాంప్ పేపర్ వరకు దేశాన్ని కుదిపేసిన కేసులను తెరపైకి తీసుకొచ్చిన ‘స్కామ్’ ఫ్రాంచైజీ ఇప్పుడు మరో సంచలన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్కామ్ 2010’ తాజాగా అధికారికంగా ప్రకటించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి మొదలైంది. అసలు ఈసారి కథ ఎవరిపై? రూ.24 వేల కోట్ల కుంభకోణం వెనుక ఏం జరిగింది? అనే అసలు నిజాలతో పాటు స్టోరీ ఇంటెన్స్ గా సాగానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

హన్సల్ మెహతా తెరకెక్కించిన ‘స్కామ్’ ఫ్రాంచైజీకి ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదటి భాగమైన ‘స్కామ్ 1992’లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని చూపించారు. ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత ‘స్కామ్ 2003’లో అబ్దుల్ కరీం తెల్గి నకిలీ స్టాంప్ పేపర్ కుంభకోణాన్ని కథగా తీసుకున్నారు. ఇప్పుడు మూడో భాగంగా ‘స్కామ్ 2010’ రాబోతోంది.

ఈసారి కథ సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ చుట్టూ తిరగనుంది. సోనీ లివ్ తాజాగా ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. సుబ్రతా రాయ్ జీవితంలో చోటుచేసుకున్న ఆర్థిక వివాదాలు, సహారా సంస్థ చుట్టూ నెలకొన్న పరిణామాలు ఈ సిరీస్‌లో ప్రధానంగా కనిపించనున్నాయి. ముఖ్యంగా రూ.24,000 కోట్లుగా పేర్కొంటున్న భారీ కుంభకోణం నేపథ్యాన్ని కథలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ‘స్కామ్ 2010’ కేవలం ఆర్థిక వ్యవహారాలకే పరిమితం కావడం లేదు. సుబ్రతా రాయ్ వ్యక్తిగత జీవితం, ఆయన ఎదుగుదల, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన విధానం వంటి అంశాలను కూడా సిరీస్‌లో చూపించనున్నట్లు సమాచారం. ఒక సాధారణ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన ప్రయాణం, ఆ తర్వాత ఎదురైన వివాదాలు కథలో కీలకంగా మారనున్నాయి.

ఇప్పటికే ‘స్కామ్’ ఫ్రాంచైజీ వాస్తవ సంఘటనలను డ్రామాటిక్‌గా చూపించడంలో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుంది. ‘స్కామ్ 1992’లో హర్షద్ మెహతా చుట్టూ జరిగిన స్టాక్ మార్కెట్ వ్యవహారాలను చూపించగా, ఆ కుంభకోణం విలువను సుమారు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మధ్యగా పేర్కొన్నారు. ‘స్కామ్ 2003’లో అబ్దుల్ కరీం తెల్గి నకిలీ స్టాంప్ పేపర్ కుంభకోణాన్ని చూపించారు. దాని విలువ సుమారు రూ.20,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల మధ్యగా పేర్కొనబడింది. ఇప్పుడు ‘స్కామ్ 2010’లో అంతకంటే భిన్నమైన వివాదాలను చూపించనున్నారు. ఈ సిరీస్‌లో సుబ్రతా రాయ్ పాత్ర కోసం ప్రముఖ మరాఠీ నటుడు సిద్ధార్థ్ బోడ్కేను ఎంపిక చేశారు. ఫస్ట్ లుక్‌లో ఆయన రూపం సుబ్రతా రాయ్‌ను పోలి ఉండటంతో పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది.

‘స్కామ్ 2010’ ఆఫీషియల్ ప్రకటనతో సుబ్రతా రాయ్ జీవితం, సహారా గ్రూప్ చుట్టూ జరిగిన ఆర్థిక పరిణామాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ప్రస్తుతం సోనీ లివ్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్, ఎన్ని ఎపిసోడ్‌లు ఉంటాయి, ఇతర నటీనటులు ఎవరనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. హర్షద్ మెహతా, తెల్గి తర్వాత మరో భారీ కుంభకోణం కథను హన్సల్ మెహతా ఎలా తెరపైకి తీసుకురాబోతున్నారన్నదే ఇప్పుడు ‘స్కామ్ 2010’పై ఆసక్తిగా మారింది.