Reading Time: 2 minutes
Amaravati To Become Indias No 1 Capital Chandrababu Naidu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైందని, భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి అభివృద్ధిపై ఆలోచించాలని, రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.

96 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు.. 190 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు
అమరావతి చుట్టూ 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు, 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనులను ప్రారంభించారని, 2028లో భారతదేశం మెచ్చే అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని మళ్లీ వస్తారని పేర్కొన్నారు. ఇక, అమరావతి వాస్తు పరంగా కూడా అద్భుతమైన ప్రాంతమని చంద్రబాబు అన్నారు. స్పీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయిన తర్వాత అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం ఒకవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమరావతి ఉద్యమంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర
గతంలో వైసీపీ నాయకులు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి రాజధాని ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతుగా పోరాడారని గుర్తుచేశారు. ముళ్లకంపలను సైతం లెక్కచేయకుండా రైతులకు అండగా పవన్ నిలిచారని పేర్కొన్నారు. తన భార్య చేతి గాజులను కూడా అమరావతి కోసం విరాళంగా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

ఆధునిక మౌలిక వసతులతో రాజధాని
అన్ని కష్టాలను అధిగమించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించామని చంద్రబాబు అన్నారు. రాజధానిలో విద్యుత్ తీగలు, కరెంట్ పోల్స్ కనిపించకుండా ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి నేరుగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్యాస్‌పై ఆధారపడకుండా వంట చేసుకునే సౌకర్యాలను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని స్థాయిలో అమరావతికి నీటి వనరులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. కృష్ణా నది తీరంలో రాజధాని నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ అమరావతిని ఆధునిక, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

బ్లూ సిటీ.. గ్రీన్ సిటీ.. గ్రీన్ ఎనర్జీ
అమరావతిని నో పొల్యూషన్ సిటీ, బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. కాలుష్యరహిత వాతావరణంతో పాటు ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అమరావతిని భవిష్యత్తులో డీప్‌టెక్ క్యాపిటల్గా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిలో నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడమే లక్ష్యమని చంద్రబాబు అన్నారు. అమరావతిలో జీవించే వారికి ఆయుష్షు పెరిగేంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజధానిలో ప్రయాణించేటప్పుడు ప్రత్యేకమైన అనుభూతి కలిగేలా రహదారులు, భవనాలు, మౌలిక వసతులను నిర్మిస్తున్నామని తెలిపారు.

కరకట్ట కష్టాలకు ఇక చెక్
ఇప్పటివరకు ప్రజలు ఎదుర్కొన్న కరకట్ట ప్రాంత ప్రయాణ కష్టాలు ఇకపై ఉండవని చంద్రబాబు అన్నారు. ఆధునిక రహదారులు, మెరుగైన కనెక్టివిటీ, సమగ్ర మౌలిక వసతులతో అమరావతి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాజధానిగా మారనుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..