
Lal Darwaza Bonalu: పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ చేపట్టిన ముందస్తు నిఘా చర్యలు విశేష ఫలితాలను ఇచ్చాయి. ఆగస్టు 9, 10 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) యం. శ్రీనివాస్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆస్తి సంబంధిత నేరాలను నివారించేందుకు స్పెషల్ క్రైమ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు.
ఫేషియల్ రికగ్నిషన్తో నేరస్థుల గుర్తింపు.. 8 మంది పాత నేరస్థులు సీజ్!
లాల్దర్వాజ ఉత్సవ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారుల వద్ద అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ వద్ద ఉన్న నేరస్థుల డేటాబేస్తో అనుమానితుల వివరాలను సరిపోల్చగా, అదుపులోకి తీసుకున్న 116 మందిలో 8 మంది పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులుగా ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యింది. చైన్ స్నాచింగ్లు, జేబుదొంగతనాలకు అలవాటుపడిన ఈ పాత నేరస్థులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మఫ్టీ పోలీసుల నిఘా.. ఒక్క చోరీ కేసు కూడా నమోదు కాలేదు
ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక పహాడాతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను మోహరించి నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. సీసీఎస్ స్పెషల్ టీమ్స్ , స్థానిక పోలీసులు సమన్వయంతో చేపట్టిన ఈ పటిష్ట బందోబస్తు కారణంగా లాల్దర్వాజ బోనాల్లో ఒక్క సెల్ఫోన్ చోరీ గానీ, చైన్ స్నాచింగ్ లేదా దొంగతనం ఘటన గానీ నమోదు కాలేదని అడిషనల్ సీపీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.