Reading Time: < 1 minute
Hyderabad: పట్టాలపై ఆడుకుంటున్న చిన్నారి.. కాపాడబోయిన తల్లి.. క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు బలి!

రైలు ఢీకొనడంతో రెండేళ్ల కుమారుడు సహా తల్లీ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ మహానగరంలో చోటుచేసుకుంది. ఫలక్‌నుమా – బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన జరిగింది. మృతులను అనూష (23), ఆమె కుమారుడు త్రినాథ్ (2)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అనూష తన భర్తతో కలిసి రైల్వే ట్రాక్‌ల పక్కన పెరిగిన గడ్డి, చెత్తను తొలగించే పనులు చేస్తోంది. ఈ దంపతులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ఇద్దరూ రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్న సమయంలో వారి రెండేళ్ల కుమారుడు త్రినాథ్ ఆడుకుంటూ అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వెళ్లాడు.

అదే సమయంలో అటువైపు రైలు రావడంతో చిన్నారిని గమనించిన తల్లి అనూష అతడిని కాపాడేందుకు పట్టాల వైపు పరుగెత్తింది. అయితే రైలు వేగంగా రావడంతో తల్లీకొడుకుడు ఇద్దరూ ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే భార్య, కుమారుడు రైలు ఢీకొని మృతి చెందడంతో తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. విగతజీవులుగా పడి ఉన్న భార్య, కుమారుడి మృతదేహాల పక్కనే కూర్చుని ఆయన కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది.

సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..