Reading Time: 2 minutes

ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఫిక్స్..  మ్యాచ్లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయంటే?

Caption of Image.

IND vs AFG T20 Series: భారత క్రికెట్ నియంత్రణ మం‌డలి (BCCI), ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్ బోర్డు (ACB) సంయుక్తంగా కీలక ప్రకటన చేశాయి. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి భారత్, ఆఫ్ఘన్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. అధికారికంగా ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్ బోర్డే ఈ సిరీస్‌కు ఆతిథ్య జట్టుగా (Host) వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సిరీస్ ఖరారు కావడంతో టీమిండియా ప్రతిపాదిత బంగ్లాదేశ్ పర్యటన దాదాపు రద్దయినట్లే కనిపిస్తోంది.  

ఆఫ్ఘనిస్థాన్‌కు హోమ్ గ్రౌండ్‌గా అరుణ్ జైట్లీ స్టేడియం: 

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. మ్యాచ్‌లు ఇండియాలోనే జరుగుతున్నప్పటికీ, సాంకేతికంగా ఆఫ్ఘన్ జట్టునే హోమ్ టీమ్‌గా పరిగణిస్తారు. గత కొంతకాలంగా ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు తమ అంతర్జాతీయ హోమ్ మ్యాచ్‌లకు భారతదేశంలోని స్టేడియాలనే వేదికలుగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆఫ్ఘన్ క్రికెట్ పురోగతికి బీసీసీఐ మొదటి నుంచి ఎంతో సహాయసహకారాలు అందిస్తోంది. 2018లో  ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్టుగా ఇండియా నిలిచింది. ఇటీవలే ఐపీఎల్ 2026 తర్వాత కూడా ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది.

ఆఫ్ఘన్ క్రికెట్‌కు బీసీసీఐ ప్రోత్సాహం: 

ఈ సిరీస్‌పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌ హోస్ట్ చేస్తున్న ఈ టీ20 సిరీస్‌కు సహకారం అందించడం ఆనందంగా ఉంది. ఇరు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలిపారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ ఆటగాళ్లకు మంచి అవకాశాలు కల్పించేందుకు బీసీసీఐ కట్టుబడి ఉందన్నారు, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆటగాళ్లకు ఎంతో అనుభవాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.  

మ్యాచ్                                    తేదీ                                              రోజు                                      వేదిక

* 1వ టీ20                             సెప్టెంబర్ 13, 2026                    ఆదివారం                            అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
* 2వ టీ20                             సెప్టెంబర్ 15, 2026                    మంగళవారం                      అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
* 3వ టీ20                             సెప్టెంబర్ 17, 2026                    గురువారం                           అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

 

©️ VIL Media Pvt Ltd.