Reading Time: < 1 minute
Hydraa Commissioner Ranganath High Court Contempt Notices

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ముందస్తు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారన్న వ్యవహారంలో ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ‘వాణి కో-ఆపరేటివ్ హెచ్‌జిఎస్ సొసైటీ’కి సంబంధించిన భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది.

రెవెన్యూ అధికారుల సూచనలు లేవు..

ఈ కేసు విచారణ సందర్భంగా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అధికారిక సూచనలు లేదా నివేదికలు లేనప్పటికీ హైడ్రా అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని బాధితుల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ రంగనాథ్ తీసుకున్న చర్యల వల్ల ఇతర ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పుడు కోర్టు బోనులో నిలవాల్సి వస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి నిజానిజాలను తేల్చేందుకు సదరు స్థలానికి సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు యొక్క తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత నాయస్థానం ప్రకటించింది.