
Speaker Ayyanna Patrudu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా వైఎస్ జగన్ ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, కాకినాడ జిల్లా తునిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరిస్తారనే నమ్మకంతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని, అందువల్ల ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.
ఇక, మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే ఉద్దేశంతోనే జగన్ను గెలిపించారని వ్యాఖ్యానించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వచ్చి తమ బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. ఎమ్మెల్యేల హాజరుపై ఇక నుంచి ప్రత్యేక విధానం అమలు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటే ఆటోమేటిక్గా కెమెరాలు ఆన్ అవుతాయని చెప్పారు. సీట్లో కూర్చున్నప్పుడే వారి హాజరును లెక్కల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ నెల 17న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు.. డీఎస్సీ అంశంపై కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. డీఎస్సీపై జగన్, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు పొందిన వారిని సైతం హేళన చేస్తున్నారని విమర్శించారు. జగన్కు ‘స్పోర్ట్స్ కోటా’ అంటే ఏమిటో తెలుసా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన నచ్చకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని మార్చుతారని అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడానికి జగన్ ఎవరు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదేనని, ప్రజలు కోరుకుంటేనే ప్రభుత్వం మారుతుందని వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..