
హార్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వ్యూహాత్మకమైన ఈ జలమార్గం తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్కు చెందిన పారామిలిటరీ బసీజ్ దళాల అధిపతి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్కు అనుబంధమైన హొస్సేన్ తాయెబ్ ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో వెల్లడించారు. ‘‘ఈరోజు మీరు చూస్తున్నది ఏమిటంటే.. హార్ముజ్ జలసంధి ఇస్లామిక్ రిపబ్లిక్ నిర్వహణ, నియంత్రణలోనే ఉంది. మా దేశం పూర్తి భద్రతతో తన మార్గంలో కొనసాగుతోంది’’ అని తాయెబ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు ట్రంప్ హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ప్రకటించారు. బుధవారం తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ట్రంప్ స్పందిస్తూ.. ‘‘అమెరికాకు హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ ఉంది. మేము దానిని కొనసాగిస్తామని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. అమెరికా చేపట్టిన నౌకా దిగ్బంధనాన్ని ‘వాల్ ఆఫ్ స్టీల్’గా అభివర్ణించారు. ‘‘మా నౌకా దిగ్బంధనాన్ని అందరూ ‘వాల్ ఆఫ్ స్టీల్’ అని పిలుస్తున్నారు. దీనిపై ఇరాన్ చేయగలిగేది ఏమీ లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే అమెరికా పదేపదే హార్ముజ్పై నియంత్రణ ఉందని చెబుతున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం ఆ వాదనను తిరస్కరిస్తోంది. ఈ జలమార్గంపై తమకే వాస్తవ నియంత్రణ ఉందని, భవిష్యత్తులో ఇక్కడ టోల్ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నట్లు గతంలోనూ స్పష్టం చేసింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా అమెరికా వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా గతంలో నిఘా వైఫల్యాల కారణంగా పరిస్థితులను తప్పుగా అంచనా వేసిందని ఆరోపించారు. ‘‘నిఘా వైఫల్యాల కారణంగా అమెరికా చాలాకాలంగా తప్పుగా అంచనా వేస్తోంది. ఇరాన్పై యుద్ధమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు హార్ముజ్ జలసంధి విషయంలో అంతకంటే పెద్ద తప్పిదానికి పాల్పడుతోంది’’ అని అరాఘ్చీ పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు విధిస్తే ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పార్లమెంట్ సభ్యులు స్పష్టం చేశారు. ఇరాన్ పార్లమెంట్, జాతీయ భద్రతా కమిషన్ సభ్యుడు బెహ్నామ్ సయీదీ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధి ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన నౌకలకు మూసే ఉంటుందని తెలిపారు. ‘‘యుద్ధ సమయమైనా, శాంతి సమయమైనా.. జియోనిస్ట్ పాలనకు చెందిన నౌకలకు హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే హక్కు ఉండదు’’ అని సయీదీ పేర్కొన్నారు. అమెరికా సైనిక నౌకలను కూడా జలసంధి మీదుగా అనుమతించబోమని స్పష్టం చేశారు.
మరోవైపు హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ చర్చలు తుది నిర్ణయానికి రాలేదు. అయితే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటైనంత మాత్రాన హార్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసింది. జలమార్గాన్ని పూర్తిగా పునఃప్రారంభించాలంటే అమెరికా తమ విస్తృత డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుందని తేహ్రాన్ తేల్చిచెప్పింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు మరోసారి ప్రధాన కేంద్రంగా మారింది.