
ఆ మినిస్టర్స్ స్పెషల్ బ్యాటింగ్ మొదలుపెట్టారా? పొలిటికల్ ఫ్రంట్ఫుట్ వేసిమరీ….సిక్సర్లు బాదే ప్రయత్నంలో ఉన్నారా? అయితే… బాల్ మిస్ అయి తృటిలో వికెట్ పడే ప్రమాదం తప్పిందా? మిస్టర్ క్లీన్గా ఉంటారనుకుంటే… క్లీన్బౌల్డ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నారంటూ ఏ మంత్రి గురించి చర్చ జరుగుతోంది? ఆయనేం చేశారంటూ ఏఐసీసీ నుంచి ఆరా తీసేదాకా ఎందుకు వచ్చింది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరో రూపంలో కలిసొచ్చి, పొలిటికల్ ఈక్వేషన్స్ ప్లస్ అయిపోయి తెలంగాణ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్. ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నాక ఎలాంటి వివాదాలు కూడా లేవు. అసలాయన కేబినెట్లో ఉన్నారా అంటూ రెగ్యులర్ పొలిటికల్ వాచ్చేసే వాళ్ళే డౌట్ పడే స్థాయిలో కామ్గా నడిచిపోతోంది వ్యవహారం. కానీ… ఇప్పుడా సైలెన్స్ బ్రేక్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కామ్నెస్ వెనక కహానీ వేరే ఉందన్న చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. అజహర్ చుట్టూ ఇటీవల గట్టి వివాదమే రేగినట్టు ప్రచారం జరుగుతోంది. తన పరిధికాని అంశంలో జోక్యం చేసుకుని ఆయన ఇబ్బంది పడ్డట్టు సమాచారం.
దానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు వెళ్లిందట. ఈ క్రమంలో తాజాగా గాంధీ భవన్లో పీసీసీ ఉపాధ్యక్షులతో భేటీ అయిన ఎఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్… అజహర్ మీద వచ్చిన ఆరోపణల గురించి ఆరా తీశారని సమాచారం. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినందునే… ఢిల్లీ లీడర్ ఆరా తీశారని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. హైదరాబాద్లో వక్ఫ్ బోర్డ్కు చెందిన ఒక ల్యాండ్ ను… అతి తక్కువ ధరకు లీజుకి ఇచ్చారన్నది మంత్రి మీదున్న ప్రధాన ఆరోపణ. పైగా ఆ రేటుకు 30 ఏళ్ళకుపైగా లీజు ఉందంటూ పార్టీలోని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీంతో అసలేం జరిగిందంటూ… ఏఐసీసీ నాయకులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
ఈ వ్యవహారం వెలుగుచూసి రచ్చ అవడంతో…ఆ ల్యాండ్ లీజుకు సంబంధించిన జీవోను వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అతి తక్కువ ధరకే లీజుకు ఇవ్వడం… నిబంధనల మేరకు కేటాయింపులు జరగలేదన్న అంశం అటు సిఎం రేవంత్ దృష్టికి కూడా వెళ్ళిందట. దీంతో… ఆ జీవోను ఆపేయమని సీఎస్ను ఆదేశించినట్టు చెబుతున్నాయి సచివాలయ వర్గాలు.
అంతవరకు ఒక లెక్క అయితే…. అసలు కేబినెట్లో ఏం జరుగుతోందో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అధిష్టానానికి చేరుతోందన్న సంగతి అజహర్ ఎపిసోడ్తో బయటపడిందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అది అజహర్ అయినా… మరో మంత్రి అయినా… చీమ చిటుక్కుమంటే…. అధిష్టానానికి లేఖలు వెళ్తున్నాయట. తాజా ఎపిసోడ్కు సంబంధించి ఏఐసీసీ ప్రతినిధి ఎలాంటి నివేదిక పంపుతారు? అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందన్న సంగతి పక్కన బెడితే…అజారుద్దీన్ కూడా బ్యాటింగ్ మొదలు పెట్టారనే సెటైర్లు ఐతే గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి.