Reading Time: 2 minutes
Rafale Vs F 16 Why Pakistan Reportedly Kept Its F 16 Fleet Grounded During Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌కు తన స్థానమేంటో చూపించింది భారత్. భారత సైన్యం చేసిన దాడులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అయితే, ఈ ఆపరేషన్ గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఇటీవల పదవీ విమరణ పొందిన ఎయిర్ కమోడోర్ ఖాలిద్ చిష్టి సంచలన విషయాన్ని బయటపెట్టారు. భారత దాడుల సమయంలో పాకిస్తాన్ తన మొత్తం ఎఫ్-16 యుద్ధ విమానాలను దాడి పెట్టిందని చెప్పారు. భయం కారణంగానే ఇలా చేశామని వెల్లడించారు.

భారత రఫెల్ జెట్‌లకు అమర్చిన మీటియార్ క్షిపణులు అధిక పరిధి, దానికున్న సామర్థ్యం వల్లే పాకిస్తాన్ ఎఫ్-16లను నేలపైనే ఉంచినట్లు తెలిపారు. F-16లోని AMRAAM క్షిపణి సుమారు 70 నుండి 100 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది, అయితే రఫేల్‌లోని మెటియోర్ క్షిపణి 120 నుండి 200 కిలోమీటర్ల పరిధిని చేరుకోగలదు. ఈ తేడా వల్ల యుద్ధం ప్రారంభం కాకముందే తమను భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని పాకిస్తానీ పైలట్లు భావించారు.

దీని ద్వారా ఆధునిక యుద్ధం కేవలం ఫైటర్ జెట్లు, పైలట్ నైపుణ్యాలపై మాత్రమే కాకుండా యుద్ధ విమానాలకు అమర్చిన క్షిపణులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడైంది.

మీటియార్ వర్సెస్ AMRAAM:

మీటియార్ క్షిపణిని యూరోపియన్ కంపెనీ MBDA అభివృద్ధి చేసింది. దీని అత్యంత ముఖ్యమైన లక్షణం దాని రామ్‌జెట్ ఇంజిన్. సాధారణ క్షిపణులు ఘన-ఇంధన రాకెట్ మోటార్ ద్వారా శక్తిని పొందుతాయి. ఘన ఇంధన రాకెట్ మోటార్ ప్రయోగించిన వెంటనే దానిలోని ఇంధనం మండిపోతుంది. రామ్ జెట్ ఇంజన్ దాని ప్రయాణం మొత్తం థ్రస్ట్ కొనసాగిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అధిక వేగాన్ని కలిగి ఉంటుంది.

ఈ కారణం వల్లే మీటియార్ క్షిపణుల నుంచి విమానాలు అంత ఈజీగా తప్పించుకోలేవు. విమానాలు ఎన్ని విన్యాసాలు చేసినా, క్షిపణులు వాటిని వేటాడుతూనే ఉంటాయి. విమానం ఎన్ని మలుపుతు తీసుకున్నా, ఎంత ఎత్తుకు ఎగిరినా క్షిపణి పరిధి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. మెటియోర్‌కు సంబంధించిన ఈ నో-ఎస్కేప్ జోన్ 60 కిలోమీటర్లకు పైగా ఉండవచ్చు, ఇది AMRAAMతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ.

రఫేల్ పైలట్, పాక్ వద్ద ఉన్న AMRAAM క్షిపణి పరిధికి సురక్షితంగా దూరంగా ఉంటూ, శత్రువును లాక్ చేసి కాల్పులు జరిపేవాడు. ఇక వేళ పాక్ ఎఫ్-16 ముందుకు వెళ్లి ఎదురుదాడి చేసే అవకాశం కూడా ఉండకుండా, భారత రఫేల్ పరిధిలోకి వచ్చి చిక్కుకునే వాడు.

ఇదే సమయంలో భారత్ వద్ద ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థ కూడా ఉండటంతో పాక్ యుద్ధ విమానాలు వెనుకడుగు వేశాయి. JF-17 ,J-10C వంటి విమానాలకు చైనా క్షిపణులను అమర్చినట్లు కొన్ని నివేదికలు సూచించినప్పటికీ, పాకిస్తాన్‌కు ప్రధాన ఆయుధంగా భావించే F-16 మాత్రం పక్కన పెట్టబడింది.

చైనా క్షిపణులు కూడా ఫెయిల్..

పాకిస్తాన్ చైనా నుండి J-10CE ఫైటర్ జెట్‌లను, PL-15 క్షిపణులను కొనుగోలు చేసింది. చైనా తయారు చేసిన PL-15 క్షిపణి 200 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరిధిని కలిగి ఉందని చెబుతుండగా, ఎగుమతి వెర్షన్ అయిన PL-15E సుమారు 145 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇది మీటియార్ క్షిపణులకు దాదాపుగా సమానంగా ఉంది. దీని డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ దీనికి వేగం, పరిధిని అందిస్తుంది. అయితే, మీటియార్ కు ఉన్న రామ్ జెట్ ఇంజన్ అత్యుత్తమ వేగాన్ని, పనితీరును అందిస్తుంది.

పీఎల్-15 శక్తిని కోల్పోగలదు, కానీ మీటియార్ చివరి వరకు దృఢంగా నిలుస్తుంది. అంతేకాకుండా, భారతదేశం వద్ద ఎస్-400 క్షిపణి వ్యవస్థ , ఉన్నతమైన సెన్సార్ ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లు మరియు నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి. నిజానికి పాక్ ప్రయోగించిన పీఎల్-15ను భారత్ ఇంటర్‌సెప్ట్ చేసి సరిహద్దుల్లో కూల్చేసింది.