Reading Time: < 1 minute
Ap Govt New Liquor Policy License Renewal Fee Updates

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుండటంతో, తదుపరి తీసుకోబోయే నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. పూర్తిగా కొత్త పాలసీని తీసుకురావాలా లేదా ప్రస్తుతం ఉన్న లైసెన్సులనే రెన్యువల్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది.

గతంలో దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.1,900 కోట్ల మేర భారీ ఆదాయం రాగా, వ్యాపారుల నుంచి 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న మార్జిన్లు తమకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని లైసెన్సుదారులు చెబుతున్నారు. కొనుగోళ్లపై కనీసం 20 శాతం మార్జిన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు.. ప్రస్తుత లైసెన్సులనే రెన్యువల్ చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం, భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజు నిర్ణయించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా నగరాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల వరకు లైసెన్స్ ధరలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఫీజును వ్యాపారులకు వెసులుబాటుగా 50 శాతం చొప్పున రెండు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.

త్వరలోనే మద్యం వ్యాపారులతో నేరుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఎంత ఆదాయం సమకూరుతుందనే అంచనాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దయిన బార్ల సుదీర్ఘకాల లైసెన్సులను తిరిగి పునరుద్ధరించే అంశంపైనా కసరత్తు కొనసాగుతోంది. వీటన్నింటిపై అధ్యయనం ముగిసిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ నూతన మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకోనుంది.