
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో వైద్యుల అత్యవసర సలహా మేరకు సర్జరీ చేయించుకోనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లోని ప్రముఖ కిమ్స్ (KIMS) హాస్పిటల్లో రేపు ఆయన భుజానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.
ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఎన్టీఆర్కు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవడానికి కావలసిన అన్ని రకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఆప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులకు, మీడియాకు తెలియజేస్తామని ఎన్టీఆర్ కార్యాలయం పేర్కొంది. ఈ వార్త తెలిసినప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరుగుతూ ఉండడంతో ఆయన నటిస్తున్న డ్రాగన్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ భుజానికి జరిగిన గాయం, ఇప్పుడు జరుగుతున్న సర్జరీ కారణంగా అది మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .