Reading Time: < 1 minute
Prabhas Fauzi Movie Dedication Mythri Ravi Speech Bhimavaram
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ (#Fauzi) సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్, ప్రభాస్ డెడికేషన్ గురించి నిర్మాతల కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భీమవరంలో జరిగిన ‘ఇరుముడి భీమవరం’ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ రవి మాట్లాడుతూ ‘ఫౌజీ’ చిత్రంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా విషయంలో ప్రభాస్ చూపిస్తున్న అంకితభావం అసాధారణమని కొనియాడారు.
“ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా కొట్టదు.. ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది! ప్రభాస్ అన్న ప్రతిరోజూ ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెట్లోనే ఉంటున్నారు. చివరికి తన షూటింగ్ పార్ట్ లేకపోయినా సెట్స్‌కు వచ్చి మరీ మానిటర్ చూసుకుంటున్నారు” అని రవి స్పష్టం చేశారు. ఈ ఈవెంట్ కోసం భీమవరం బయలుదేరే ముందు ప్రభాస్‌ను కలిసి.. “అన్నా, భీమవరం వెళ్తున్నాను. మీ అభిమానులకు ఏమైనా చెప్పమంటారా?” అని అడగ్గా, ప్రభాస్ ఇచ్చిన సమాధానం అందరి హృదయాలను గెలుచుకుంది. “మన ఫ్యాన్స్ అందరినీ బాగా చదువుకోమని చెప్పు” అని ప్రభాస్ పర్సనల్ మెసేజ్ ఇచ్చినట్లు తెలిపారు. సినిమా మేకింగ్ లో ప్రభాస్ చూపిస్తున్న ఇన్వాల్వ్‌మెంట్ చూస్తుంటే ‘ఫౌజీ’ థియేటర్లలో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని స్పష్టమవుతోంది!