
CM Revanth Reddy : తెలంగాణలో రైస్ మిల్లర్ల గోల్మాల్ వ్యవహారాలు , పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పౌర సరఫరాల శాఖపై గురువారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిఫాల్ట్ మిల్లుల స్వాధీనం.. మహిళా సంఘాలకు బిగ్ ఆఫర్
ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయి ప్రభుత్వ బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలా స్వాధీనం చేసుకున్న మిల్లులను, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు (మహిళా సంఘాలకు) అప్పగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు కీలక సూచన చేశారు. మిల్లర్ల నుండి బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా పక్కా విధానాన్ని (పాలసీ) రూపొందించాలని, దీనిపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో 100 ఎకరాల్లో మోడల్ గోడౌన్లు
ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ప్రాథమికంగా 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ గోడౌన్ల నిర్మాణాన్ని చేపడతారు. ఈ గోడౌన్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించారు.