Reading Time: 2 minutes
Virat Kohli: ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ ఎందుకు స్పెషల్? మాజీ కోచ్ చెప్పిన ఆసక్తికర విషయాలివే

Virat Kohli: భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో ఫీల్డింగ్ చేసేటప్పుడు కోహ్లీ చూపించే ఉత్సాహం, ఆటిట్యూడ్ చాలా స్పెషల్ అని కొనియాడారు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా కోహ్లీ అంతే కష్టపడతారని, ఆయన చూపించే ఈ నిబద్ధత ఇతర ఆటగాళ్లను కూడా తమ పరిమితులను దాటి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రేరేపిస్తుందని వ్యాఖ్యానించారు.

టి. దిలీప్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియాతో ఐదేళ్ల పాటు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన టి. దిలీప్ పదవీకాలం ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఆయన జోష్‌కు సాటి లేదు. పవర్ ప్లే ఓవర్లలో కవర్‌లో ఉన్నా, షార్ట్ మిడ్ వికెట్‌లో ఉన్నా ఆయన చూపే ఫ్లెక్సిబిలిటీ, కొట్టే డైవ్‌లకు తిరుగుండదు. కెరీర్‌లో ఈ స్థాయిలో ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో కూడా సర్కిల్ దాటి బంతిని ఆపడానికి పరుగెత్తే మొదటి ప్లేయర్ ఆయనే” అని దిలీప్ పేర్కొన్నారు.

మరో ఐదుగురు ఆటగాళ్లకు ప్రేరణ

కోహ్లీ చూపించే ఈ అంకితభావం మ్యాచ్‌ల్లోనే కాకుండా ప్రాక్టీస్ సెషన్లలో కూడా సరిసమానంగా ఉంటుందని దిలీప్ తెలిపారు. “విరాట్ కోహ్లీకి మ్యాచ్‌కి, ప్రాక్టీస్ సెషన్‌కి ఏమాత్రం తేడా ఉండదు. కోహ్లీతో కలిసి ఫీల్డింగ్ చేయడం ద్వారా జట్టులోని మరో ఐదుగురు ఆటగాళ్లు తమ సాధారణ పరిమితులను దాటి మెరుగైన ఫీల్డింగ్ చేయడానికి ప్రేరణ పొందారు. జట్టుపై కోహ్లీ చూపిన ప్రభావం అలాంటిది” అని దిలీప్ వెల్లడించారు. 2024 టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం బార్బడోస్ డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణం తన కెరీర్‌లోనే బెస్ట్ మూమెంట్ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

2027 వన్డే ప్రపంచకప్‌పై కన్ను

విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ విజయం సాధించిన అనంతరం ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. అలాగే 2025లోనే టెస్ట్ క్రికెట్‌కు కూడా ఆయన వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..