Reading Time: 2 minutes
Prasad Babu : ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు..

ప్రముఖ నటుడు ప్రసాద్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై, బుల్లితెరపై నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం, ఎదుగుదల వెనుక ఉన్న పలు ఆసక్తికర, అనూహ్య సంఘటనలను పంచుకున్నారు. దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణలతో తన వ్యక్తిగత అనుబంధాలను, వృత్తిపరమైన అనుభవాలను వివరించారు. ప్రసాద్ బాబు తన తొలి సినిమా “గీత” ప్రారంభోత్సవం సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. అక్కినేని స్టేజీపైకి వస్తున్న సమయంలో తాను కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నానని, అప్పుడు ఆయన గొప్పతనం తనకు తెలియదని అన్నారు. ఆ తర్వాత భయపడుతూ, తప్పు చేశాననే భావనతో అక్కినేనికి నమస్కారం పెట్టగా, అక్కినేని “ఏయ్! నా దగ్గర ఇలాంటివి ఉండవు. అక్కడ పెట్టుకోండి” అంటూ చమత్కరించారని తెలిపారు. “సార్, మీరంటే గౌరవం. మా కన్నా వయసులో పెద్దోళ్లు. పైగా మీకు వేషాలు కూడా లేవు. నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి” అని తాను అన్నానని, ఆ తర్వాత అప్పటి తప్పును సరిదిద్దుకున్నానని చెప్పి అక్కినేనితో స్నేహాన్ని పెంచుకున్నానని ప్రసాద్ బాబు వివరించారు. అప్పటి నుండి అక్కినేని ఆయన్ని “సాధూ” అని పిలుస్తూ కబుర్లు చెప్పడం మొదలుపెట్టారట.

సూపర్ స్టార్ కృష్ణ – ఒక దేవుడు:

ప్రసాద్ బాబు సూపర్ స్టార్ కృష్ణను “దేవుడు” అని తెలిపారు. “కృష్ణుడు వేషం వచ్చినప్పుడు కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడు ఏంటి?” అని ఆయన పీఏ మూర్తి అడిగేవాడని ప్రసాద్ బాబు గుర్తు చేసుకున్నారు. కృష్ణతో తన తొలి చిత్రం “దొంగల వేట”లో సైడ్ విలన్ పాత్రలో నటించానని, ఆ రోజు సాయంత్రమే పద్మాలయ నుండి తనకు పిలుపు వచ్చిందని ఆయన తెలిపారు. కృష్ణ దయవల్లే ఆ అవకాశం లభించిందని, ఎవరూ తెలియని తనకు పద్మాలయ వంటి పెద్ద సంస్థ నుండి అవకాశాలు రావడం కృష్ణ చలవేనని స్పష్టం చేశారు. కృష్ణ ఎలాంటి సిఫార్సులు చేయకపోయినా, తన నటనను చూసి అవకాశాలు ఇచ్చేవారని ప్రసాద్ బాబు చెప్పారు. పద్మాలయ బ్యానర్‌పై వచ్చిన “శభాష్ బేబీ” చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆయన తెలిపారు.

“మా ఊరి పాండవులు” – కెరీర్‌కు మలుపు:

మురళీమోహన్ సలహా మేరకు జయకృష్ణ ఆఫీస్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు బాపును కలిశానని, అక్కడ “చొక్కా ఇప్పేయ్” అని బాపు అనగానే తాను ఆశ్చర్యపోయానని ప్రసాద్ బాబు గుర్తు చేసుకున్నారు. బాపు ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటో అప్పట్లో తనకు తెలియదని, పేపర్ నాలెడ్జ్ గానీ, బయటి ప్రపంచం గురించి గానీ అవగాహన లేదని ఆయన ఒప్పుకున్నారు. చొక్కా విప్పిన తర్వాత “నువ్వు పో” అని బాపు చెప్పగా, తాను అయోమయానికి గురయ్యానని తెలిపారు. తర్వాత “నువ్వే భీముడు” అని చెప్పి ఒక క్యాసెట్ ఇచ్చారని, కన్నడ వెర్షన్‌కు చెందిన ఆ క్యాసెట్‌ను తాను చూడలేదని, ఇతరుల నటనను కాపీ కొట్టడం ఇష్టం లేక, తనదైన శైలిలో నటించాలనుకున్నానని ప్రసాద్ బాబు వివరించారు. కృష్ణంరాజు గారు, మురళీమోహన్ వంటి ప్రముఖులతో కలిసి “మా ఊరి పాండవులు” చిత్రంలో భీముడి పాత్ర పోషించానని, అది చాలా పెద్ద వేషమని, జాగ్రత్తగా చేయాలని భావించానని చెప్పారు. ఈ చిత్రం విడుదలైన రెండో రోజే తనకు 30-40 చిత్రాలకు అవకాశాలు వచ్చాయని, అది రాత్రికి రాత్రే తనను స్టార్‌ను చేసిందని పేర్కొన్నారు. “మా ఊరి పాండవులు” తన కెరీర్‌లో అత్యంత గుర్తింపు తెచ్చిన చిత్రంగా ఆయన చెప్పుకొచ్చారు. అప్పటినుండి ఆర్టిస్ట్‌గా ఒక ముద్ర పడిపోయిందని, ఎక్కువ సినిమాలు చేయాలనే ధ్యేయంతో, ఎక్కువ రోజులు అడిగే సినిమాలను వదిలి తక్కువ రోజుల సినిమాల వైపు మొగ్గు చూపానని ప్రసాద్ బాబు వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..