
ఆయన తమిళనాడులోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. అయితేనేం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ఆయనే నటరాజన్ చంద్రశేఖరన్. టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ గా టాటా పరివారాన్ని నడిపించిన చంద్రశేఖరన్ అనూహ్యంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏజీఎంకు సరిగ్గా రెండు రోజులు ముందు ఆయన రాజీనామా సమర్పించడం కార్పోరేట్ వర్గాలను షాక్కు గురి చేసింది.అసలు టాటా గ్రూప్లో చంద్రశేఖరన్ ప్రయాణం ఎలా సాగింది? ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులేంటి?
ఎన్. చంద్రశేఖరన్ తమిళనాడులోని నామక్కల్ జిల్లా మోహనూర్ అనే చిన్న గ్రామంలో 1963 జూన్ 2న జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఒక తమిళ మీడియం ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ప్రారంభంలో కుటుంబం కోరుకున్నట్లు వ్యవసాయ రంగంలోకి వెళ్లాలని ఆయన భావించారు. అయితే ఆ తర్వాత కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్ లో డిగ్రీ పూర్తి చేశారు. తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1986లో MCA పూర్తి చేశారు. చదువు చివరి సెమిస్టర్లో క్యాంపస్ ఇంటర్న్షిప్ ద్వారా TCSలోకి ప్రవేశించారు. ఇంటర్న్షిప్ ప్రారంభించిన రెండు నెలలకే TCS ఆయనకు ఇంజనీర్గా పూర్తిస్థాయి ఉద్యోగం ఇచ్చింది. అలా 1987లో TCSలో చంద్రశేఖరన్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
TCSలో సాధారణ ఇంజనీర్గా చేరిన చంద్రశేఖరన్ రెండు దశాబ్దాల పాటు సాంకేతిక..నాయకత్వ బాధ్యతల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. 2007 నాటికి ఆయన కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొంది, 2009లో CEO -MD అయ్యారు. 45 ఏళ్ల వయస్సులోనే దేశంలోని అగ్రగామి ఐటీ సంస్థకు సీఈఓగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఆయన నాయకత్వంలో TCS మార్కెట్ విలువలో భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రపంచ స్థాయి ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెంది డిజిటల్.. క్లౌడ్ విభాగాల్లో అగ్రస్థానానికి చేరింది. ఆయన చూపిన క్రమశిక్షణ.. వ్యూహాత్మక ఆలోచనలు కార్పొరేట్ రంగాన్ని ఆకట్టుకున్నాయి. 2017 వరకు TCS సీఈఓగా కొనసాగి.. ఆపై టాటా సన్స్ బాధ్యతలను స్వీకరించారు.
2016 అక్టోబర్లో అప్పటి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ నిష్క్రమణతో గ్రూప్లో అనిశ్చితి నెలకొంది. ఆ సంక్షోభ సమయంలో రతన్ టాటా మధ్యంతర చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2017 జనవరి 12న టాటా సన్స్ బోర్డు నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా చంద్రశేఖరన్ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 21న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. టాటా కుటుంబంతో ఎలాంటి రక్తసంబంధం వివాహ సంబంధం లేకుండా ఈ స్థాయి బాధ్యతలు తీసుకున్న మొదటి వ్యక్తి ఈయనే. అలాగే ఈ పదవిని అధిరోహించిన మొదటి పార్సీయేతర వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. 2022 ఫిబ్రవరిలో ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు అంటే 2027 ఫిబ్రవరి వరకు పొడిగించారు.
చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖరన్ వన్ టాటా వ్యూహంతో ముందుకు సాగారు. కంపెనీల పునర్నిర్మాణం, వ్యాపార విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. 2022 జనవరిలో ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్లోకి తీసుకురావడం ఆయన సాధించిన అతిపెద్ద విజయం. 1932లో ప్రారంభమై ప్రభుత్వ పరం అయిన ఎయిర్ ఇండియా, దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరింది. దీంతో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా సెమీకండక్టర్ తయారీ, గుజరాత్ UK లలో ఈవీ బ్యాటరీ గిగాఫ్యాక్టరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టాటా డిజిటల్ ద్వారా కన్స్యూమర్ ఇంటర్నెట్ రంగంలోకి అడుగుపెట్టారు. TCSలో ఏఐ ఆధారిత సేవల విస్తరణకు కూడా ఆయన ఆద్యుడిగా నిలిచారు.
ఎన్నో విజయవంతమైన వ్యాపార నిర్ణయాలతో పాటు ఆయన కాలంలో కొన్ని సవాళ్లు.. ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం టాటా గ్రూప్తో పాటు వ్యక్తిగతంగా చంద్రశేఖరన్ కి కూడా పెద్ద మచ్చే. అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగానికి ఎదురైన ధరల ఒత్తిడి TCS ఆదాయంపై ప్రభావం చూపింది. 2025 చివర్లో జాగ్వార్ లాండ్ రోవర్ పై జరిగిన సైబర్ దాడి వల్ల బ్రిటన్ ఉత్పత్తి రంగంపై ప్రభావం పడింది. ఇవన్నీ నడుస్తుండగానే…టాటా సన్స్ ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. నోయెల్ టాటా నాయకత్వంలోని టాటా ట్రస్ట్స్, చంద్రశేఖరన్ పునర్నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బోర్డు ప్రాతినిధ్యం, వ్యాపార వ్యూహాలపై ఇరు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి.
టాటా సన్స్ను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మార్చాలనే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రతిపాదనపై కూడా చర్చలు జరిగాయి. షాపోర్జీ పల్లోంజీ గ్రూప్ వాటాల నిష్క్రమణ అంశం కూడా భేదాభిప్రాయాలకు కారణమైంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఆగస్టు 18న జరగాల్సిన ఏజీఎంలో ఓటింగ్ వరకు వెళ్లకుండానే చంద్రశేఖరన్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుత పదవీకాలమైన 2027 ఫిబ్రవరి వరకు ఆయనే చైర్మన్గా కొనసాగనున్నారు. నాలుగు దశాబ్దాల పాటు టాటా గ్రూప్కు అందించిన సేవలు, సాధించిన విజయాలు ఆయనను భారత కార్పొరేట్ చరిత్రలో అగ్రగామిగా నిలబెట్టాయి. టాటా సన్స్ తదుపరి వారసుడు ఎవరనేది కార్పొరేట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.