
ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడలోని సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరొక కీలక అరెస్ట్ జరిగింది. హోంగార్డు వెంకటరాజు అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు పొందుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం హోంగార్డు వెంకటరాజును సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. కృష్ణలంక పోలిసు స్టేషన్లో సాయి కృష్ణకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను మాయం చేసినట్లుగా పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు డీవీఆర్ సైతం ధ్వంసం చేశాడు.
డెత్ కేసులో ఆధారాలు దొరక్కుండా సీఐ నాగరాజు.. హెడ్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ వెంకట రాజును ఉపయోగించుకున్నాడు. 20-06-26న సిట్ అధికారులు విచారణకు పిలిచినా వెంకట రాజు వాస్తవాలు చెప్పలేదు. వెంటక రాజుకి సీసీ కెమెరాల ఆపరేషన్లో అనుభవం ఉంది. సాయికృష్ణని అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన ఘటనలో చనిపోయాడు. సాయికృష్ణ మృతదేహం మాయం చేయడానికి A 4 సురేష్ సహకారం అందించాడు. సాయికృష్ణని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన, తీసుకెళ్లిన ఆధారాలను ధ్వంసం చేశారు. 14-06-26న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో స్టేషన్ సెల్లార్, స్టేషన్ అవుట్డోర్, ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్ను తొలగించారు. అదేరోజు పోలీస్ స్టేషన్లో సీఐ రూమ్లో ఉన్న 4 హార్డ్ డిస్క్లు తొలగించామని అశోక్.. వెంకట రాజుకి చెప్పాడు. హార్డ్డిస్క్లు తొలగించిన తర్వాత వాటిని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని స్టోర్ రూమ్లో దాచారు. సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్లను తొలగించనట్లు అనుమానం రాకుండా కెమెరాలను ఆన్లోనే ఉంచారు. తొలగించిన హార్డ్ డిస్క్ స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లు ఇన్స్టాల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా హోంగార్డు డిస్క్ లు తొలగించి ఆధారాలు ధ్వంసం చేశాడు. సాయి కృష్ణ గురించి ఆధారాలేవీ దొరక్కుండా ఉండేందుకు కొత్తవి ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో ఉండాల్సిన డేటాను ఉద్దేశ పూర్వకంగా అందరూ కలిసే తొలగించారు. ఆధారలను, సాక్ష్యాలని ధ్వంసం చేయడం కోసం అందరూ కలిసి భాగస్వాములయ్యారు. సాయికృష్ణ లాకప్ డెత్ అవ్వడానికి A1 నుంచి A6 వరకు అందరి పాత్ర ఉంది. ఒక పథకం ప్రకారమే A1 నుంచి A7 వరకు ఆధారాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరా విజువల్స్ తొలగించడంలో నాగరాజు, అశోక్, వెంకట రాజు ముగ్గురు కీలకంగా ఉన్నారు.