
Hardik Pandya: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నెట్టింట ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్లో 2024లో తిరిగి చేరిన హార్దిక్కు జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీజన్లో జట్టు తీవ్ర నిరాశాజనకమైన ప్రదర్శన చేయడంతో వచ్చే సీజన్కు ముంబై అతనితో కొనసాగే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో హార్దిక్ను ట్రేడ్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉందనే ప్రచారంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేసుల మధ్య ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. హార్దిక్ తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కే తిరిగి వెళ్లేందుకు ఆ జట్టు మేనేజ్మెంట్తో చర్చలు జరిపినట్లు సమాచారం. గుజరాత్ ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా హార్దిక్ పునరాగమనానికి మొగ్గు చూపినప్పటికీ, ఈ డీల్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. దీనికి కారణం హార్దిక్ విధించిన షరతేనని తెలుస్తోంది. మళ్లీ కెప్టెన్సీ ఇస్తేనే జట్టులోకి వస్తానని హార్దిక్ గుజరాత్ టైటాన్స్ ముందుకు ప్రతిపాదన ఉంచగా, ఆ షరతును అంగీకరించేందుకు ఫ్రాంచైజీ నిరాకరించడంతో ట్రేడ్ ఆగిపోయిందట.
ఈ అంశంపై గుజరాత్ టైటాన్స్ ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించగా, హార్దిక్ మేనేజర్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా ట్రాన్స్ఫర్ లేదా ట్రేడ్ విషయమై మాట్లాడలేదని, ఎలాంటి చర్చలైనా కేవలం ముంబై ఇండియన్స్ యాజమాన్యం ద్వారానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్కే ఆడిన హార్దిక్, 2022లో గుజరాత్ టైటాన్స్ కొత్తగా వచ్చినప్పుడు ఆ జట్టుకు కెప్టెన్గా మారి తొలి ఏడాదిలోనే ట్రోఫీ అందించాడు. ఆ తర్వాతి సీజన్లో కూడా గుజరాత్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. అయితే, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు టీమిండియాను నడిపించిన రోహిత్ శర్మను తప్పించి, 2024లో ట్రేడ్ ద్వారా తిరిగి ముంబైకొచ్చిన హార్దిక్కు ముంబై యాజమాన్యం కెప్టెన్సీ ఇచ్చింది. ఈ నిర్ణయం ముంబై అభిమానులను తీవ్రంగా నిరాశపరచగా, ఆ సీజన్లో జట్టు ప్లేఆఫ్స్ కూడా చేరకపోవడంతో అభిమానుల అసంతృప్తి మరింత పెరిగింది.