Reading Time: 2 minutes
త్వరలో కొత్త సర్వీసెస్ స్టార్ట్‌ చేస్తున్న యాపిల్..! ఫోన్‌పే, గూగుల్‌పేకు పోటీ తప్పదా

కొత్త సర్వీసులను అందించడంలో పేరుగాంచిన యాపిల్ సంస్థ త్వరలో భారత్‌లో యాపిల్ పే సేవలను ఆవిష్కరించనుంది. కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సామర్థ్యంతో వస్తున్న ఈ సేవలు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన డిజిటల్ పేమెంట్ సర్వీస్ యాపిల్ పేను భారత్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన పదేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఈ సర్వీస్ కోసం ఐఫోన్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తొలి దశలో యూపీఐ సేవలు ఇందులో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రారంభంలో యాపిల్ పే ద్వారా యూపీఐ లావాదేవీలు జరిపే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

యాపిల్ పే‌లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతితో పాటు ఒక బ్యాంక్ పార్ట్‌నర్ స్పాన్సర్‌షిప్ తప్పనిసరి. ఈ ప్రక్రియ కాస్త సంక్లిష్టంగా ఉండటంతో యాపిల్ సంస్థ ప్రారంభంలో క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపులపైనే దృష్టి పెట్టాలని భావిస్తోంది. కాబట్టి గూగుల్ పే, ఫోన్ పే తరహాలో యూపీఐ పేమెంట్లకు యాపిల్ పే వెంటనే ప్రత్యామ్నాయంగా మారకపోవచ్చు.

ట్యాప్ అండ్ పే విశేషాలు

ఇక తొలి దశలో యాపిల్ పే పూర్తిగా క్రెడిట్ కార్డుల చుట్టూనే తిరగనుంది. దీనికోసం యాపిల్ ఇప్పటికే వీసా, మాస్టర్‌కార్డ్ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లతో పాటు భారత్‌లోని క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. యూజర్లు తమ క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్‌లో యాడ్ చేసుకోవచ్చు. అనంతరం ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ చేసే పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద ఐఫోన్‌తో నేరుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు. అంటే ఇకపై ఫిజికల్ క్రెడిట్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఐఫోన్‌తో ఆథెంటికేట్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చన్నమాట.

ఛార్జీల వివాదం

యాపిల్ పే భారత్‌లో అడుగుపెట్టడానికి ప్రధాన అడ్డంకిగా మారిన అంశం ఛార్జీలు. నివేదికల ప్రకారం ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీపై 15 నుండి 20 బేసిస్ పాయింట్ల మేర వాటా కావాలని యాపిల్ డిమాండ్ చేస్తోంది. కానీ కొన్ని ప్రముఖ బ్యాంకులు మాత్రం దీన్ని 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయాలని కోరుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ రుసుమును నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయరు. కార్డు లావాదేవీల ద్వారా బ్యాంకులు సంపాదించే రాబడి నుంచే యాపిల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి.