
అమెరికాలోని హిందూ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో న్యూయార్క్లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. AHEAD ఫోరమ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ విషయమై ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ కూడా ట్వీట్ చేశారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అయితే కార్యక్రమాన్ని కేవలం పండుగ వేడుకలకే పరిమితం చేయకుండా ఐక్యత, పౌర బాధ్యత, పరస్పర గౌరవం, మతాంతర అవగాహన, ప్రపంచ సామరస్యం వంటి అంశాలపై చర్చలకు వేదికగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావనను ఆధారంగా చేసుకుని సమాజంలోని వివిధ వర్గాలను కలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మోహన్ భగవత్ పాల్గొననున్నట్లు ప్రకటన
ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయన 2009 నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్గా కొనసాగుతున్నారు. అమెరికాలోని పెద్ద బహిరంగ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొనడం, ప్రసంగించడం ప్రాధాన్యత సంతరించుకుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన మరిన్ని వివరాలను రానున్న వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రతినిధులు
అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాలయాలు, యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సేవా సంస్థలు, భాషా-ప్రాంతీయ సంఘాలు, సాంస్కృతిక బృందాలు, వివిధ మతాల సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. సమాజ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, కళాకారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మాజీ సైనికులు, మత నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలు కూడా పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు.
సేవ, పౌర భాగస్వామ్యంపై దృష్టి
అమెరికన్ సమాజంలో హిందూ అమెరికన్లు విద్య, వైద్యం, వ్యాపారం, ప్రజా సేవ, దాతృత్వం, స్వచ్ఛంద సేవ తదితర రంగాల్లో అందిస్తున్న సేవలను ఈ వేడుకల ద్వారా ప్రస్తావించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్షాబంధన్ సోదరసోదరీమణుల మధ్య బంధానికి ప్రతీకగా నిలిచినప్పటికీ.. దాని సందేశాన్ని కుటుంబ పరిధిని దాటి సమాజం, మానవత్వం, ప్రకృతి, సమస్త సృష్టి పట్ల బాధ్యతగా విస్తరించాలన్నదే కార్యక్రమం ఉద్దేశమని వివరించారు.
AHEAD ఫోరమ్ ఏం చేస్తుంది?
AHEAD ఫోరమ్ అమెరికా వ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలు, సమాజ నాయకుల మధ్య సహకారం, సంభాషణ, పౌర భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పనిచేస్తున్న వేదికగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా హిందూ తత్వశాస్త్రం, సంస్కృతి, అమెరికన్ సమాజానికి హిందూ అమెరికన్ల సేవలపై అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Rashtriya Swayamsevak Sangh’s ( RSS) Sarsanghachalak ( Chief) Dr Mohan Bhagwat ji will be Visiting USA, Canada and UK from 25 th Aug 2026 on the invitation from overseas local associations and organisations. This coincides with the occasion of ongoing Centenary year of RSS.
— Sunil Ambekar (@SunilAmbekarM) August 11, 2026