Reading Time: 2 minutes
Sir In Telangana 73 39 Lakh Voter Names Removed Hyderabad Records Highest Deletions

SIR In Telangana: తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 73,39,334 ఓట్లను తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.38 కోట్లకుపైగా ఓటర్లలో సుమారు 2,64,87,214 ఓట్లను డిజిటలైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారం అర్ధరాత్రితో ముగిసింది.

తెలంగాణలో ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియలో 78.3%పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. డిజిటలైజేషన్‌లో భాగంగా చనిపోయిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లు, డబుల్ ఓట్లు, గుర్తించలేని ఓట్లు తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 9.22 లక్షల చనిపోయిన ఓట్లు, 6.70 లక్షల డబుల్ ఓట్లు, 11.25 లక్షల నాన్-ట్రేసబుల్ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు సుమారు 45 లక్షల షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి. ఇతర కేటగిరీలో లక్షకుపైగా ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఓట్లు తొలిగిపోయాయి. హైదరాబాద్‌లో సుమారు 19.40 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 10.73 లక్షల ఓట్లు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అత్యల్పంగా ఓట్ల తొలగింపు జరిగిన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, ములుగు ఉన్నాయి. భువనగిరిలో 26 వేల ఓట్లు, ములుగులో 27 వేల ఓట్లు తొలగించబడ్డాయి. నియోజకవర్గాల వారీగా పూర్తి వివరాలు కూడా త్వరలో వెల్లడికానున్నాయి.

ఓటర్ల జాబితాలో సుమారు 45 లక్షల షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో తెలంగాణలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోయిన వారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి, ఇతర కారణాలతో తాత్కాలికంగా తెలంగాణలో నివసిస్తూ, ఎన్నికల సమయంలో తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ఓటర్లు కూడా ఈ కేటగిరీలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారిలో కొందరు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు ఉండటం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించడం వంటి అంశాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డబుల్ ఓట్లను ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. తుది ఓటర్ల జాబితా వెలువడిన తర్వాత కూడా డబుల్ ఓట్లను గుర్తించేందుకు సాంకేతిక వ్యవస్థ ద్వారా పరిశీలన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి ఒకే చోట ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో తమ పేరు లేకపోయినా, ఇతర వివరాలపై అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ప్రక్రియ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉండనుంది.