Reading Time: < 1 minute
Ap High Court Questions Police Over Ranger Play App Case

AP High Court: పోలీసులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కొమ్మారెడ్డి అవినాష్‌ రేంజర్ ప్లే యాప్‌ సహాయంతో రూ.37 కోట్లు దారి మళ్లించారన్న కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి మూడేళ్లు గడిచినా దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందని నిలదీసింది. దర్యాప్తులో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని పోలీసులను ఆదేశించింది.

కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేయడంలో జాప్యానికి గల కారణాలను కూడా అఫిడవిట్‌లో స్పష్టంగా వెల్లడించాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసు దర్యాప్తు పురోగతిపై తదుపరి విచారణలో వివరాలను పరిశీలించనున్నట్లు హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.