
Indiramma Houses: హైదరాబాద్ నగరంలో నివసించే పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం లక్ష ఇందిరమ్మ ఇండ్ల ఫ్లాట్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అందులో భాగంగా కేపీహెచ్బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించనుంది. తొలి దశలో CURE పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 ప్రాంతాలను ఎంపిక చేసి, రూ. 807.40 కోట్ల అంచనా వ్యయంతో 7,340 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కేపీహెచ్బీలో ఒక్కచోటే 480 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఫ్లాట్ కొలతలు, ధర అంచనాలు , చెల్లింపుల విధానం
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్లో నిర్మించే ప్రతీ ఫ్లాట్ 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఆధునికంగా రూపుదిద్దుకోనుంది. ఈ పథకం కింద ఒక్కో ఫ్లాట్కు ప్రభుత్వం రూ. 5 లక్షల భారీ సబ్సిడీని అందిస్తుండగా, లబ్ధిదారుడి వాటాగా రూ. 6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును పేదలు సులభంగా చెల్లించేలా నాలుగు దశలుగా వర్గీకరించారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో రూ. 1 లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ. 2 లక్షలు, ఫినిషింగ్ దశలో రూ. 2 లక్షలు చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ హ్యాండోవర్ చేసే సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలు , దరఖాస్తు ప్రక్రియ
సంవత్సరానికి రూ. 6 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉండి, CURE పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ లేని కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ప్రతి కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులకే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు మీసేవ కేంద్రాలు, అఫీషియల్ వెబ్సైట్ meeseva.telangana.gov.in లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఎలాంటి సర్టిఫికెట్లు జతచేయాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 100 అప్లికేషన్ ఫీజుతో పాటు రూ. 10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. లాటరీలో ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే ఈ అడ్వాన్స్ మొత్తం వెనక్కి రీఫండ్ అవుతుంది, ఒకవేళ ఫ్లాట్ అలాట్ అయితే లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15, 2026 నాటి వరకు గడువు ఉంది.
కేటాయింపుల రిజర్వేషన్లు , నిర్మాణాలు జరిగే ప్రాంతాలు
సొంతింటి కేటాయింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా లాటరీ విధానంలోనే సాగుతుంది. ఇందులో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, క్లాస్-4 , పారిశుధ్య కార్మికులకు 10% కేటాయించగా, మిగిలిన 50% ఫ్లాట్లను జనరల్ కేటగిరీకి వర్తింపజేస్తారు. అన్ని కేటగిరీలలోనూ మహిళలకు ప్రత్యేకంగా 30% రిజర్వేషన్ ఉంటుంది. ఈ ఇందిరమ్మ టవర్లను కేపీహెచ్బీతో పాటు మల్కాజిగిరి కౌకూర్, శేరిలింగంపల్లి రాయదుర్గం, మహేశ్వరం జల్పల్లి, నాంపల్లి రెడ్హిల్స్, నీలోఫర్ సైట్, సనత్నగర్ పాటిగడ్డ, మలక్పేట గడ్డిఅన్నారం, ఇబ్రహీంపట్నం బండ్లగూడ, మేడ్చల్ పోచారం, రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి, కుత్బుల్లాపూర్ గాజులరామారం, ఖైరతాబాద్ హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్, అంబర్పేట సిటీ పోలీస్ లైన్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లి , కార్వాన్ కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్ వంటి కీలక ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.