
టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోగా, నిర్మాతగానే కాకుండా మా అసోసియేషన్ అధ్యక్షుడిగానూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారాయన. చివరిగా కన్నప్ప అనే సినిమాలో కనిపించారు మంచు విష్ణు. 2024లో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. శివుని భక్తుడు భక్తకన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. ఇలా ఎంతో మంది స్టార్స్ నటించారు. ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు మంచు విష్ణు. అయితే చిత్ర బృందం ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. ఈ సినిమా రిలీజై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. అయినా ఇప్పటివరకు తన తర్వాతి సినిమాను ప్రకటించలేదీ మంచు వారబ్బాయి. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు టాలీవుడ్ హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కల్యాణ్ రామ్, నితిన్ అలాగే అక్కినేని సుమంత్ లతో తనకున్న అనుబంధం గురించి బయటపెట్టాడు.
‘నితిన్, కల్యాణ్ రామ్లతో కలిసి సినిమాలు చేద్దామాని చాలా సార్లు ఆఫర్లు ఇచ్చాను. కానీ రాస్కెల్స్ వారు ఒప్పుకోలేదు (నవ్వుతూ). ఇప్పటివరకు ఒక సుమారు నాలుగు సినిమాలు ఆఫర్ చేసుంటాను వారికి. ఇక అక్కినేని సుమంత్ నా కన్నా చాలా పెద్దోడు. అతను ఎక్కడైనా కనిపిస్తే గొంతు పిసికేయాలనిపిస్తుంది. నేను హీరోగా చేసిన ‘మోసగాడు’ సినిమాలో సుమంత్ కు ఆఫర్ ఇచ్చాను. నేను చేయను అని డైరెక్టుగా చెప్పేశాడు. క్యారెక్టర్ బాగా లేదనో, వేరే కారణంతోనే సుమంత్ నాతో సినిమా చేయలేదు. ఈడో రకం.. ఆడో రకం సినిమా కోసం ఫస్ట్ కల్యాణ్ రామ్ నే అడిగాను. ఇక నితినో అయితే 12 నుంచి 14 సంవత్సరాల క్రితం నుంచే సినిమా చేయాలని అనుకుంటున్నాను. కానీ కుదరరడం లేదు. నాకు, నితిన్ కు టైమింగ్ బాగుంటుంది. ఇద్దరమూ దోస్తానా సినిమా చేయాలని అనుకున్నాం కూడా. కానీ కుదరలేదు. నితిన్ కు హిట్ వస్తే నాకు హిట్ వచ్చినట్టే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అతను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నాకు బాగా తెలుసు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నితిన్ వెరీ హార్డ్ వర్కర్. అతని సినిమాలు ఫస్ట్ షోనే చూస్తుంటాను. అలాగే కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ అని మెసేజ్ లు కూడా చేస్తుంటాను. నితిన్ చేసిన ప్రతి సినిమా నేను చూస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.