
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలువుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన సాగుతోందని జగన్ విమర్శించారు. రాత్రి 2:45 గంటల సమయంలో వందల మంది పోలీసులు దొంగల్లా, బందిపోటు ముఠాలా వచ్చి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి డోర్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆయనను అపహరించుకుపోయారని ఆరోపించారు. పగటిపూట నోటీసులు ఇస్తే రాని ఉగ్రవాదా ఆయన అని ప్రశ్నించారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆయన కుమారుడు, తమ్ముడు, తమ్ముడి కుమారుడిని కూడా ఈ కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు.
ఆగష్టు 1న సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిపై దాడి జరుగుతుంటే, ఆయన రక్షణ కోసం ఎమ్మెల్యే విరూపాక్షి మానవత్వంతో అక్కడికి వెళ్లడమే నేరమన్నట్లు పోలీసులు వ్యవహరించారని జగన్ తెలిపారు. స్థానిక ఎస్సై, సీఐలకు ఫోన్ చేసినా పోలీసులు కాపాడకపోవడంతోనే ఎమ్మెల్యే స్వయంగా వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత నెమకల్లు వద్ద ఎమ్మెల్యేపై దాడి చేసి, ఆయన తమ్ముడి చెయ్యి విరగ్గొట్టారని వెల్లడించారు.
ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలు తానే చించి, ఆ నెపం ఎమ్మెల్యేపై నెట్టి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయని, సదరు మహిళతో తప్పుడు మాటలు చెప్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఈ అక్రమాలపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలని జగన్ పిలుపునిచ్చారు.