
Amaravati Unstoppable: అమరావతి అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమరావతిలోనే నిర్వహించుకుంటున్నామని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. తాను అమరావతి రాజధాని నిర్మాణానికి సంకల్పం చేశానని, ఆ సంకల్పాన్ని ప్రతిరోజూ ముందుకు తీసుకెళ్లడం ద్వారా రాజధానిని ఈ స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. 2047 నాటికి అమరావతిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడంతో పాటు ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి తొలి అడుగు
అమరావతి రాజధానికి రాజమార్గంగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. స్టీల్ బ్రిడ్జిలతో కలిసి ఈ రహదారి అందుబాటులోకి రావడం రాజధాని నిర్మాణంలో తొలి మెట్టు అని అన్నారు. నగర నిర్మాణంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, మూడో దశలో తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. సింధు నాగరికత తరహాలో రాజధాని నగరంలో సీడ్ యాక్సెస్ రహదారుల నిర్మాణం జరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రహదారులు, స్టీల్ బ్రిడ్జిలతో అమరావతి కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
190 కి.మీ. ఔటర్.. 96 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్లు
అమరావతి అభివృద్ధిలో భాగంగా 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు కేంద్రం మంజూరు చేసిందని సీఎం తెలిపారు. రాజధాని పరిధిలో అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ప్రాంతాలు కార్పొరేషన్లతో సహా భాగంగా ఉంటాయని వివరించారు. అమరావతిని పూర్తి కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. డీప్టెక్ క్యాపిటల్గా తీర్చిదిద్దడంతో పాటు ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమరావతి ఆర్థిక రాజధానిగా కూడా ఎదగాలని, రాజధాని అభివృద్ధికి ప్రజలు తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని సీఎం కోరారు.
2028లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం
2028 నాటికి భారతదేశం మెచ్చే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్ది, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. రాజధానిలో నిర్మిస్తున్న రహదారులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని, ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు.
పవన్ కల్యాణ్, మోడీతో కలిసి కొత్త ప్రగతికి నాంది
పవన్ కల్యాణ్, తాను, ప్రధాని మోదీ కలిసి రాష్ట్రంలో ఊహించని ప్రగతికి నాంది పలుకుతున్నామని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా మార్చాలన్న సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జెండా పండుగ కాదు
స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జెండా వందనం నిర్వహించే పండుగ కాదని చంద్రబాబు అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతోమంది చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజు అని పేర్కొన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. రైతులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు.. ఎవరి రంగంలో వారు అభివృద్ధికి కృషి చేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. వచ్చే 21 ఏళ్లలో భారత్ను వికసిత్ భారత్గా మార్చే లక్ష్యంతో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి
మనిషి జీవించడానికి చెట్లు అవసరమని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టు నాటే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 15న జాతీయ స్ఫూర్తితో ఈ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఇల్లు, ప్రతి వాణిజ్య సంస్థపై జాతీయ జెండా ఎగరాలని కోరారు. మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరంగా ర్యాలీలను ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు.
ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తును మార్చుకోవాలి
ప్రజలు తమ భవిష్యత్తును మార్చుకునే శక్తి ఓటు రూపంలో ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం, దేశం ఎలా అభివృద్ధి చెందాలనే విషయంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కష్టాల కుటుంబం నుంచి దేశ అత్యున్నత పదవికి ఎదిగిన ద్రౌపది ముర్ములో ఉన్న శక్తి, సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
మొదటి మెట్టు ఎక్కాం.. చివరి మెట్టు వరకు పోరాటం
అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు మెట్లు కడుతూ వచ్చామని, సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలతో ఇప్పుడు మొదటి మెట్టు ఎక్కామని చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి మెట్టు చేరుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా అవతరించే శక్తి సామర్థ్యాలు దేశానికి ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అదే స్ఫూర్తితో 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా, అమరావతిని ప్రపంచస్థాయి ఆర్థిక, సాంకేతిక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రజలంతా సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు.