
Pakistan Cricketers Focus on Money: పాకిస్థాన్ క్రికెట్లో యువ ఆటగాళ్ల ఆసక్తిపై ఆదేశ మాజీ సెలెక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దేశం కోసం ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావించే రోజులు తగ్గిపోయాయని, నైపుణ్యాలు పెంచుకోవడం కంటే సంపాదనపై ఎక్కువ దృష్టి పెడుతున్న ఆటగాళ్లు పెరిగారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఆటపై ఫోకస్ తగ్గిందంటున్న మాజీ సెలెక్టర్..
పాకిస్థాన్ తరపున 50 టెస్టులు ఆడిన ఇక్బాల్ ఖాసిమ్, ఆ జాతీయ జట్టు ఎంపిక వ్యవహారాల్లో పలుమార్లు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అలాంటి సీనియర్ ప్లేయర్ ఇప్పుడు యువ ఆటగాళ్ల తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పాకిస్థాన్ క్రికెట్లో చర్చకు దారితీసింది.
చాలామంది యువ క్రికెటర్లు తమ ఆటను మెరుగుపరుచుకోవడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, నైపుణ్యాలను పదును పెట్టడంపై తగినంత శ్రద్ధ చూపడం లేదని ఖాసిమ్ అభిప్రాయపడ్డారు. సంపాదనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ఆయన విమర్శించారు.
ఆయన వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపించిన అంశం ఒక్కటే.. ఆటగాడి ఎదుగుదలకు వ్యక్తిగత కృషి చాలా అవసరం. శిక్షకులు, సహాయక సిబ్బంది, గణాంకాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వయంగా తమ లోపాలను గుర్తించి వాటిపై పని చేయాలని సూచించారు.
లీగ్ ఒప్పందమే విజయానికి కొలమానమా?
ప్రస్తుతం క్రికెట్లో ఆర్థిక అవకాశాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. దేశవాళీ పోటీలు, అంతర్జాతీయ క్రికెట్తో పాటు పలు లీగ్ల ద్వారా ఆటగాళ్లకు మంచి ఆదాయం లభిస్తోంది. పాకిస్థాన్ యువ ఆటగాళ్లలో కొందరు తమ విజయాన్ని ప్రధానంగా పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఒప్పందం దక్కించుకోవడంతోనే కొలుస్తున్నారని ఖాసిమ్ అభిప్రాయపడ్డారు.
అయితే డబ్బు సంపాదించడంలో తప్పేమీ లేదన్నది ఆయన మాటల సారాంశం కాదు. ముందు ఆటగాడిగా ఎదగాలి.. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.. ఆటను లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత డబ్బు సహజంగానే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆటలో అత్యున్నత స్థాయికి చేరాలంటే ప్రతిరోజూ కొంత సమయం తనను తాను మెరుగుపరుచుకోవడానికి కేటాయించాల్సిందే. పరిస్థితులను చదవడం, ప్రత్యర్థి బలహీనతలను గుర్తించడం, సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవడం వంటి అంశాల్లో వ్యక్తిగత శ్రమకు ప్రత్యామ్నాయం లేదని ఖాసిమ్ పేర్కొన్నారు.
పాత రోజులను గుర్తు చేసిన ఖాసిమ్..
తన క్రికెట్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఖాసిమ్ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. 1987లో బెంగళూరులో భారత్పై పాకిస్థాన్ సాధించిన టెస్టు విజయంలో భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఇచ్చిన సలహా తనకు ఉపయోగపడిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని సరైన ప్రాంతాల్లో బంతులు వేయడంపై బేడీ ఇచ్చిన సూచనను తాను పాటించానని ఖాసిమ్ చెప్పారు. ఆ అనుభవం తన ఆలోచనా విధానాన్ని మార్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి సందర్భాలే ఆటగాడి ఎదుగుదలకు దోహదపడతాయని ఆయన అభిప్రాయం. అనుభవజ్ఞుల నుంచి నేర్చుకోవడం, మైదానంలో పరిస్థితులను స్వయంగా అర్థం చేసుకోవడం, ప్రతి మ్యాచ్ నుంచి కొత్త విషయాన్ని గ్రహించడం క్రికెటర్కు ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఎంపిక వ్యవస్థపైనా తీవ్ర ప్రశ్నలు..
కేవలం ఆటగాళ్లనే కాకుండా పాకిస్థాన్ క్రికెట్లోని ఎంపిక విధానంపైనా ఖాసిమ్ విమర్శలు చేశారు. గతంలో సెలెక్టర్లు ఎలాంటి పారితోషికం లేకుండా బాధ్యతలు నిర్వర్తించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సెలెక్టర్లకు భారీ పారితోషికాలు అందుతున్నా, నిర్ణయాల్లో దీర్ఘకాలిక దృష్టి కనిపించడం లేదని అన్నారు.
జట్టు ఎంపికలో వివిధ వర్గాల జోక్యం కూడా సమస్యలకు కారణమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. షాహిద్ అఫ్రిది విషయంలో తాను సెలెక్టర్గా తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేస్తూ, జట్టులో ఎవరిని ఎంపిక చేయాలన్నది సెలెక్టర్ల బాధ్యత, తుది పదకొండు మందిని ఆడించాలన్నది కెప్టెన్ నిర్ణయమని అప్పట్లో స్పష్టం చేసినట్లు తెలిపారు.
అఫ్రిది చివరకు జట్టులో ఆడి తొలి మ్యాచ్లోనే వికెట్లు సాధించాడని ఖాసిమ్ గుర్తుచేశారు. ఇలాంటి అనుభవాల నుంచి నేర్చుకోకుండా వ్యవస్థలో నిరంతరం గందరగోళం కొనసాగితే పాకిస్థాన్ క్రికెట్కు నష్టం తప్పదన్న భావన ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..