Reading Time: 3 minutes

ఉద్యోగాల కల్పన నుంచి ఉద్యోగ భద్రత దిశగా.. భారత్ ముందున్న దారి ఇదే !

Caption of Image.

గత మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే  ఆ ఉద్యోగాలు ఎంత భద్రతను కల్పిస్తున్నాయి, కార్మికులకు ఎంత స్థిరత్వాన్ని అందిస్తున్నాయనేది ముఖ్యం. ఇప్పటికీ  దేశంలో గణనీయమైన సంఖ్యలో కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. భవిష్య నిధి, పింఛన్, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు వారికి అందుబాటులో లేవు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌‌‌‌‌‌‌‌కు,  కొత్త ఉద్యోగాల సృష్టితోపాటు అధికారిక ఉపాధిని విస్తరించడం కూడా కీలక విధాన ప్రాధాన్యంగా మారింది.  ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి  వికసిత్ భారత్  రోజ్‌‌‌‌‌‌‌‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌‌‌‌‌‌‌‌వై) ప్రాధాన్యం సంతరించుకుంది. 2025 ఆగస్టు 1న ప్రారంభమైన ఈ పథకం, ఆగస్టు 1తో తొలి ఏడాది పూర్తి చేసుకుంది. 

తొలిసారి ఉద్యోగం పొందే యువతను ప్రోత్సహించడంతోపాటు, అదనపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. 2025 ఆగస్టు నుంచి 2027 జులై వరకు రూ.99,446 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా 3.5 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించడం,  అందులో 1.92 కోట్ల మంది తొలిసారి అధికారిక ఉద్యోగాల్లోకి రావడం లక్ష్యంగా నిర్దేశించారు.

అధికారిక ఉపాధికే ఎందుకు ప్రాధాన్యం ?
ఉద్యోగాల సంఖ్య,  నిరుద్యోగిత రేటు వంటి అంశాల పైనే  సాధారణంగా చర్చ జరుగుతుంది. కానీ ఉద్యోగాల స్వరూపం, వాటి భద్రత కూడా అంతే కీలకం. అధికారిక ఉద్యోగాల్లో పనిచేసేవారికి భవిష్య నిధి, పదవీ విరమణ పొదుపు,  సామాజిక భద్రత వంటి చట్టబద్ధ ప్రయోజనాలు  లభిస్తాయి. ఇవి ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే కాకుండా,  అనుకోని పరిస్థితులను ఎదుర్కొనే భరోసాను కల్పిస్తాయి. అధికారిక ఉపాధి వల్ల యజమానులకు కూడా  ప్రయోజనం ఉంటుంది.

శిక్షణ పొందిన స్థిరమైన మానవ వనరులు అందుబాటులోకి రావడంతో ఉత్పాదకత  పెరుగుతుంది.  కార్మిక  సంక్షేమ  కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా సాగుతుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశిస్తున్న తరుణంలో వారు తొలినుంచే సంఘటిత రంగంలో  చేరడం దేశ జనాభా శక్తిని ఆర్థిక శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఉద్యోగులకు, యజమానులకు ప్రోత్సాహం
పీఎం-వీబీఆర్‌‌‌‌‌‌‌‌వై ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఉద్యోగులు, యజమానులు ఇద్దరికీ ప్రోత్సాహకాలు అందించేవిధంగా రూపొందించడమైనది. నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందే తొలిసారి ఉద్యోగులకు ఒక నెల ఈపీఎఫ్  వేతనానికి  సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు  ప్రోత్సాహకం అందుతుంది.

దీనిని ఆరు నెలలు,  పన్నెండు నెలల నిరంతర సేవ  అనంతరం రెండు  విడతలుగా చెల్లిస్తారు.  రెండో విడత పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.  ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని ప్రత్యేక పొదుపు సాధనంలో జమచేయడం ద్వారా యువ ఉద్యోగుల్లో పొదుపు సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు.

కొత్త ఉద్యోగులను నియమించుకునే యజమానులకు కూడా ఈ పథకం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుంది. అదనంగా నియమించిన ఉద్యోగి కనీసం ఆరు నెలలు కొనసాగితే, ఒక్కో ఉద్యోగిపై  నెలకు  గరిష్ఠంగా రూ.3,000 వరకు రెండేళ్లపాటు ప్రోత్సాహకం లభిస్తుంది. తయారీ రంగంలో అధిక ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆ రంగానికి ఈ ప్రోత్సాహకాన్ని మూడు, నాలుగు సంవత్సరాల వరకు పొడిగించారు. దీంతో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

తొలి ఏడాదిలో ప్రోత్సాహకర ఫలితాలు
ఏ పథకమైనా దాని ఫలితాల ద్వారానే అంచనా వేయబడుతుంది. పీఎం-విబిఆర్‌‌‌‌‌‌‌‌వై  అమలైన తొలి ఏడాదిలోనే 72 లక్షలకుపైగా యువత తొలిసారి అధికారిక ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మహిళలు ఉండటం మహిళల అధికారిక ఉపాధి భాగస్వామ్యం పెరుగుతున్న సంకేతంగా భావించవచ్చు. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉపాధి అనుసంధాన ప్రోత్సాహకాలను అందుకున్నారు.

ఈ గణాంకాలు అధికారిక ఉపాధి విస్తరణలో పథకం ప్రారంభ ప్రభావాన్ని సూచిస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక విజయాన్ని కేవలం లబ్ధిదారుల సంఖ్యతో కాకుండా,  ఉద్యోగులు ఎంతకాలం కొనసాగుతున్నారు,  సంస్థలు ఎంతమేరకు అధికారిక నియామకాలను  పెంచుతున్నాయి, సామాజిక భద్రత ఎంత విస్తరించింది వంటి ప్రమాణాలతో అంచనా వేయాల్సి ఉంటుంది.

సాంకేతికతతో పారదర్శక అమలు
పీఎం-విబిఆర్‌‌‌‌‌‌‌‌వై అమలులో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), ఎలక్ట్రానిక్ చలాన్- కమ్- రిటర్న్ (ఈసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఉమంగ్ యాప్‌‌‌‌‌‌‌‌లో ఫేస్ అథెంటికేషన్ వంటి సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తున్నారు. ప్రోత్సాహకాలు నేరుగా ఆధార్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ (డీబీటీ) ద్వారా జమ అవుతాయి.

లబ్ధిదారుల వివరాలు, రంగాలవారీగా పురోగతిని పర్యవేక్షించేందుకు  ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.  అలాగే ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌వో, ఈఎస్ఐసీ, చీఫ్  లేబర్ కమిషనర్ కార్యాలయాల సమన్వయంతో  దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముందున్న దారి
భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాల కల్పన ఎంత ముఖ్యమో, ఆ ఉద్యోగాలకు భద్రతను కల్పించడం కూడా అంతే ముఖ్యమైనది.  ఈ నేపథ్యంలో పీఎంవీబీఆర్‌‌‌‌‌‌‌‌వై ఉద్యోగాల సంఖ్యను పెంచడమే కాకుండా,  అధికారిక ఉపాధి విస్తరణ, సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి  ప్రయత్నిస్తోంది. అయితే  ఒక్క పథకంతోనే  కార్మిక మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అన్ని సవాళ్లు పరిష్కారం కావు. ఆర్థిక వృద్ధి, పరిశ్రమల్లో పెట్టుబడులు,  నైపుణ్యాభివృద్ధి,  వ్యవస్థాపకత వంటి అంశాలు సమాంతరంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

అయినప్పటికీ అధికారిక నియామకాలను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు దేశ ఉపాధి వ్యవస్థను మరింత బలోపేతం చేయగలవు.  భారత్‌‌‌‌‌‌‌‌కు యువశక్తి  కొదవ లేదు. ఆ యువశక్తికి స్థిరమైన, భద్రమైన, సామాజిక రక్షణ కలిగిన ఉపాధిని అందించడం అసలైన సవాలు. ఉద్యోగాల కల్పనతోపాటు ఉద్యోగ భద్రతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్న పీఎంవీబీఆర్‌‌‌‌‌‌‌‌వై.. ఆ దిశగా ఒక ముఖ్యమైన విధానపరమైన ముందడుగుగా చెప్పవచ్చు.

అర్ధ శ్రీనివాస్ పటేల్, భారతీయ సమాచార సేవ (IIS) అధికారి

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.