
పెట్రోల్, డీజిల్ ధరలను ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, గల్ప్ దేశాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొనడం, ముడి చమురు ధరలు దిగిరావడంతో ఇంధన ధరలను త్వరలో తగ్గించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాహనదారులు కూడా తగ్గింపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ప్రత్యక్ష్యంగా ఏమీ లేదని, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని పేర్కొంది.
ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గుతాయా? అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి సురేష్ గోపి స్పందించారు. ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదన్న ఆయన.. ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని అన్నారు. భారత్లో ఇంధన ధరల పెరుగుదల అనేది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. పొరుగు దేశాల కంటే భారత్లోనే చౌకగా లభిస్తుందన్నారు. ముడి చమురు ధరల్లో అస్థిరత ఉన్నప్పటికీ.. జూన్ 2021 నుంచి జూన్ 2026 మధ్య దేశంలోనే ధరలు పెరుగుదల తక్కువగా ఉందని స్పష్టం చేశారు. అమెరికాలో పెట్రోల్ ధరలు 70.6 శాతం, జర్మనీలో 51.1 శాతం, యూకేలో 46.9 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్లో 59.9 శాతం, పాకిస్తాన్లో 160.6 శాతం, శ్రీలంకలో 148.6 శాతం, నేపాల్లో 75 శాతం పెరిగాయన్నారు. కానీ భారత్లో పెట్రోల్ ధర 8.1 శాతం, డీజిల్ ధర 11.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు.
ఎక్సైంజ్ సుంకం తగ్గింపు
ఇక పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.10 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. దీని వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చగా.. ప్రభుత్వ పన్ను రాబడి కూడా తగ్గిందని తెలిపింది. ప్రభుత్వం ధరల్లో ఇప్పుడు ఎలాంటి కొత్త తగ్గింపును ప్రకటించలేదని సురేష్ గోపి స్పష్టం చేశారు. కాగా ఫిబ్రవరి 28న ఇరాన్-అమెరికా వార్ మొదలవ్వగా.. ఆ తర్వాత నాలుగుసార్లు కేంద్రం ధరలను పెంచింది. ఏప్రిల్ 16న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్పై రూ.3 పెంచగా.. మే 19న లీటర్కు రూ.0.09, మే 15న లీటర్పై రూ.4.74, డీజిల్పై రూ.4.82 చొప్పున పెరిగింది.